- జులైలో యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 6 లక్షల కోట్లు
- 325 కోట్లకు ట్రాన్సాక్షన్ల నెంబర్
- కార్డు పేమెంట్స్ వెనకబడుతున్నయ్
న్యూఢిల్లీ: యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ట్రాన్సాక్షన్లు అంతకు ముందు ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులై నెలలో 42 శాతం పెరిగాయి. విలువపరంగా ఈ ట్రాన్సాక్షన్లు జులైలో రూ. 6.06 లక్షల కోట్లని, జూన్ 2021లోని రూ. 5.47 లక్షల కోట్ల రికార్డును దాటేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా వెల్లడించింది. జులై 2021లో కార్డుల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు రూ. 1.36 లక్షల కోట్లకే పరిమితమయ్యాయని పేర్కొంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లోని రూ.95,883 కోట్లతో పోలిస్తే ఇవి బాగా పెరిగాయని, ఎకానమీ రికవరీతోనే ఇది సాధ్యమైందని ఆర్బీఐ డేటా వివరించింది. రోజువారీ అవసరాలకు కొనే వాటికి, ప్రీమియం కొనుగోళ్లకూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లే చేస్తుండటంతో యూపీఐ ప్లాట్ఫామ్స్ ఏకంగా 109 శాతం గ్రోత్ సాధించాయి. ఆన్లైన్ పేమెంట్లలో ఎక్కువగా క్రెడ్ వంటి యూపీఐ యాప్స్ ద్వారానే జరుగుతున్నాయని ఇంప్రెసేరియో హ్యాండ్మేడ్ రెస్టారెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రియాజ్ అమ్లాని చెప్పారు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ల ఏవరేజ్ వాల్యూ కూడా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత 20 శాతం పెరిగిందని అన్నారు. ఎకానమీ రికవరీతో ఇతర ఖర్చులను కన్జూమర్లు పెంచినప్పటికీ, కార్డు ట్రాన్సాక్షన్లు యూపీఐ ప్లాట్ఫామ్స్తో పోటీ పడలేకపోతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ట్రాన్సాక్షన్ల పరంగా చూస్తే జులై నెలలో యూపీఐ ద్వారా 325 కోట్లు (3.25 బిలియన్లు) రికార్డయ్యాయి. ఇదే కాలంలో కార్డుల ద్వారా జరిగినవి 52 కోట్లే (520 మిలియన్లే). యూపీఐ పేమెంట్లు గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతున్నాయని లె మార్చె చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ దత్తా వెల్లడించారు. సులభంగా ఉండడానికి తోడు, కాంటాక్ట్లెస్ కావడంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కార్డు పేమెంట్ల కంటే వేగంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయని బ్యాంకర్లూ చెబుతున్నారు. ఫ్యూచర్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని యాక్సిస్ బ్యాంక్ హెడ్ సంజీవ్ మోఘె చెప్పారు. మర్చంట్లకు చెల్లింపులకే కార్డులు వాడుతున్నారు. కార్డుల చెల్లింపులు ఏటా 30–40 శాతం పెరిగితే ఆరోగ్యకరమేనని ఆయన పేర్కొన్నారు. తమ సేల్స్లో 10 నుంచి 15 శాతం యూపీఐ పేమెంట్ ప్లాట్ఫామ్స్, వాలెట్స్ నుంచే వస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటెయిల్ చెయిన్ విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్తా చెప్పారు. ఎక్కువ విలువైన వస్తువులకు కూడా కొన్నిసార్లు యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారానే కన్జూమర్లు చెల్లిస్తున్నట్లు వివరించారు.
నెట్ లేకుండానే....యూపీఐ
యూపీఐ పేమెంట్స్ జరపాలంటే ఖరీదైన ఫోన్లుంటేనే వీలవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇంటర్నెట్ లేని ఫీచర్ ఫోన్ల నుంచీ యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. *99# కి డయల్ చేయడం ద్వారా ఫీచర్ ఫోన్ల నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం చాలా ఈజీ అని ఎన్పీసీఐ చెబుతోంది. బాలెన్స్ ఎంక్వయిరీ, యూపీఐ పిన్ ఛేంజ్, ట్రాన్సాక్షన్లు వంటివన్నీ చేసుకోవచ్చని వివరిస్తోంది. మెనూ ఆధారంగా సులభంగా ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి అనువుగా దీనిని డెవలప్ చేసినట్లు పేర్కొంది. రిజిస్టర్డ్ మొబైల్ నుంచి *99# కి డయల్ చేయడం ద్వారా ఈ సర్వీస్లను పొందవచ్చు.