యాప్ ద్వారా యూరియా సేల్స్..జిల్లాలో నేటి నుంచి బుకింగ్ స్టార్ట్

యాప్ ద్వారా యూరియా సేల్స్..జిల్లాలో నేటి నుంచి బుకింగ్ స్టార్ట్
  •      షార్జేజ్, అనవసర వినియోగంపై చెక్​ 

నిజామాబాద్​, వెలుగు: యాసంగి సీజన్​కు సంబంధించి యూరియా అమ్మకాలు సోమవారం నుంచి మొబైల్​ యాప్​ ద్వారా జరుగనున్నాయి. యాప్​ద్వారా బుకింగ్​ చేసుకునేందుకు గ్రామపాలనాధికారులు రైతులకు సహకరించనున్నారు. ఇందుకోసం యువజన, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు, ఏ పంట వేశారన్న అంశాన్ని బట్టి యూరియా బ్యాగ్​లు ఇస్తారు. జిల్లాలో యాసంగి సీజన్​లో 5,22,730 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. 

ఇందులో 4,31,042 ఎకరాల్లో సన్న రకం వరి, 60,793 ఎకరాల్లో దొడ్డురకం వరి, 25,202 ఎకరాల్లో మొక్కజొన్న , 11,987 ఎకరాల్లో సజ్జలు, 1,869 ఎకరాల్లో జొన్న , 24,867 ఎకరాల్లో గడ్డి జొన్న, 14,679 ఎకరాల్లో శనగ, 8,239 ఎకరాల్లో నువ్వులు, 1,265 ఎకరాల్లో సన్​ ఫ్లవర్​, 2,065 ఎకరాల్లో పొగాకు, 773 ఎకరాల్లో మినుము ,​ 213 ఎకరాల్లో సోయాబీన్సాగు చేయనున్నారు. సీజన్​ అవసరాల కోసం సీడ్​, యూరియా, కాంప్లెక్స్​ ఎరువుల ఇండెంట్​ఇదివరకే సర్కార్​కు పంపారు. జిల్లాకు 82 వేల మెట్రిక్​ టన్నుల యూరియా అవసరమని ఇండెంట్​ పెట్టారు. రెండు వారాల నుంచి జిల్లాలో వరినాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 38 వేల టన్నుల యూరియా అమ్మకం జరిగింది. 

390 మంది డీలర్ల వద్ద 12 వేల టన్నుల స్టాక్​ఉంది. మరో 32 వేల టన్నుల సరుకు రావాల్సిఉంది. యూరియా కొరత ఏర్పడుతుందన్న ఆందోళనతో రైతులు సీజన్​ మొత్తానికి అవసరమైన యూరియా బస్తాలు ఒకేసారి స్టాక్​ చేసుకోవడంవల్ల కొరత ఏర్పడుతుంది. ఎప్పుడు ఎంత అవసరమో అంత కొనుగోలు చేస్తే అందరికీ యూరియా ఇబ్బందిలేకుంగా అదుతుంది. గత సీజన్​లో తలెత్తిన పరిస్థితి పునరావృతం కాకుండా యాప్​ బుకింగ్​ అమలు చేయనున్నారు. 

అవసరానికి మించి ఇవ్వరు

వరి పంట నాట్లు, పిలక దశ, పొట్టదశలో ఒక్కో బస్తా చొప్పున ఎకరానికి 3 బస్తాల యూరియా పంపిణీ చేస్తారు. రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుకు ఒకేసారి 3 బ్యాగ్​ల చొప్పున ఇస్తారు. 3 ఎకరాలు మించితే రెండు దఫాలు, ఐదెకరాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి మూడు దఫాలుగా యూరియా ఇస్తారు. 

రైతు సాగు చేస్తున్న పంట, భూమి విస్తీర్ణం యాప్​లో నమోదు చేయగానే ఆయనకు దగ్గరలో ఎక్కడ సరుకు ఉందో యాప్​లో వివరాలు కనిపిస్తాయి. దాని ఆధారంగా డైరెక్ట్​గా వెళ్లి బస్తాలు తీసుకోవచ్చు. యూరియా కోసం ఎక్కడా క్యూలు కట్టాల్సిన అవసరం ఉండదు. 

కొరతకు చెక్ 

లోపాలు లేకుండా.. కొరతకు అవకాశం లేకుండా యాప్​ ద్వారా యూరియా అమ్మకాలు విప్లవాత్మక మార్పునకు నాంది కానుంది. యూరియా దుర్వినియోగం, అధిక వినియోగం, బస్తాల కోసం క్యూ కట్టడం వంటి సమస్యలకు యాప్​ పరిష్కారంగా నిలుస్తుంది. బుకింగ్​లో స్వచ్చంద సంస్థలు రైతులకు సహాయం చేస్తాయి. - వీరాస్వామి, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​