కొంతకాలం నుంచి కొనసాగుతోన్న లేఆఫ్స్ పర్వం దిగ్గజ టెక్ కంపెనీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లోనూ భారత ఐటీ వృత్తి నిపుణులు, టెకీలకు అంత ఆశాజనంగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్ష కారణంగా తెలుస్తోంది. ఐటీ రంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోన్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ క్రమంలో యూఎస్ కు చెందిన ప్రాప్ టెక్ కంపెనీ ఫ్రంట్ డెస్క్ గూగుల్ మీట్ లో 2నిమిషాల్లోనే తన 200మంది ఉద్యోగులను తొలగించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. గూగుల్ హార్డ్వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్లు, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులకు లేఆఫ్స్ మెయిల్స్ పంపినట్లు తెలిపింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని మెయిల్లో కంపెనీ పేర్కొంది.
గూగుల్ (Google) గత కొన్ని నెలల్లోనే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే 2024 ఈ దిగ్గజ సెర్చింగ్ కంపెనీ మరిన్ని ఉద్యోగాల కోతలను విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వెలువడిన ఓ నివేదికలో ది వెర్జ్ కోట్ చేసిన అంతర్గత మెమోలో కంపెనీ చీఫ్ సుందర్ పిచాయ్ భారీ మార్పులను సూచించారు. తమకు ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలున్నాయని, ఈ సంవత్సరం తాము ప్రాధాన్యత ఉన్న వాటిల్లో పెట్టుబడి పెడతామని చెప్పారు. ఈ పెట్టుబడి కోసం సామర్థ్యాన్ని సృష్టించడానికి తాము కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిచాయ్ నుండి కోట్ చేసిన మెమో పేర్కొంది.
2024లోనూ ఫ్లిప్ కార్ట్ ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తోంది.. గతేడాది భారీ ఎత్తున ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగి స్తోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు 15 వందల మంది ఉద్యోగులు ఇంటి బాట పట్ట నున్నారు. పనితీరు సమీక్షలతో ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. నివేదిక ప్రకారం.. మార్చి- ఏప్రిల్ 2024 నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తుందట.
2023 ఉద్యోగులకు కలిసి రాలేదు. ముఖ్యంగా స్టార్టప్లలో పనిచేస్తున్న వారు తమ జాబ్స్ ఎప్పుడు ఊడుతాయా? అని భయంతో బతికారని చెప్పొచ్చు. దేశంలోని 100 స్టార్టప్ కంపెనీలే ఏకంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఫండ్స్ సేకరించడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. లేఆఫ్స్ డాట్ ఎఫ్వైఐ విడుదల చేసిన డేటా ప్రకారం, అప్పులతో ఇబ్బందులు పడుతున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ రెండో రౌండ్లో భాగంగా ఈ ఏడాది 2,500 మందిని తీసేసింది.
గ్లోబల్గా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. 2023లో ఏకంగా 1,160 టెక్ కంపెనీలు 26,02,238 మందిని జాబ్స్ నుంచి తొలగించాయి. కిందటేడాది అయితే 1,064 టెక్ కంపెనీలు 1,64,969 మందిని తీసేశాయి. కొత్త ఫండ్స్ రాకపోవడంతో స్టార్టప్లు తమ ఖర్చులు ముఖ్యంగా మార్కెటింగ్, ఉద్యోగుల ఖర్చును తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం చూస్తే ఈ ఏడాది జనవరి – నవంబర్ మధ్య దేశంలోని స్టార్టప్లు సేకరించిన ఫండ్స్ 65.8 శాతం పడిపోయాయి. ఈ ఏడాది ఇండియన్ స్టార్టప్లు 1,013 వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ డీల్స్ ద్వారా 6.9 బిలియన్ డాలర్లు సేకరించాయని గ్లోబల్డేటా వెల్లడించింది.