
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆ దేశ చట్టసభ సభ్యుడు బడ్డీ కార్టర్ కోరారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన పేరును నామినేట్ చేశారు. ఈ మేరకు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదుర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఆయన వల్లే ఇంత త్వరగా ఒప్పందం కుదిరింది.
ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను కూడా ట్రంప్ అడ్డుకున్నారు. ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారు. అందుకే ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి” అని కోరారు. కాగా, ఇంతకుముందు రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో సభ్యుడు కూడా ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని నామినేట్ చేశారు. అలాగే పాక్ ప్రభుత్వం ఆయన పేరును ప్రతిపాదించింది.
ఉక్రెయిన్ సభ్యుడు ఉపసంహరణ..
ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని ఉక్రెయిన్కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝాకో కూడా ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.