ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ముగిసిందని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక ‘ట్రూత్’ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. ఖతార్లోని అమెరికా మిలటరీ బేస్పై సోమవారం(జూన్ 23, 2025) ఇరాన్ మిస్సైల్ అటాక్ చేసిన గంటల వ్యవధిలో ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించడం గమనార్హం. అయితే.. ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఇప్పటికి అయితే అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని నిర్ధారించలేదు. టెహ్రాన్తో పాటు ఇరాన్లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై జూన్ 13న ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3’ పేరుతో ఇరాన్ కూడా మిస్సైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ ఇంధన ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’ పేరుతో జూన్ 22 ఉదయం ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది. ఈ పరిణామంతో ప్రపంచమే నిర్ఘాంతపోయింది. ఇందుకు ప్రతీకారంగా.. ఇరాక్, ఖతార్లోని అమెరికా మిలటరీ బేస్లపై ఇరాన్ మిస్సైల్స్ దాడులు చేసింది.

‘ఆపరేషన్​ బేషరత్​ ఫతా’ పేరుతో ఖతార్, ఇరాక్​​లోని అమెరికా ఎయిర్​బేస్​లపై విరుచుకుపడింది. ఖతార్‌లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్​పైనా మిసైల్స్​తో అటాక్​ చేసింది. అల్‌ ఉదీద్‌.. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్​ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్​ అయ్యారు. అమెరికాలోని వైట్​హౌస్​ వార్​రూంలో ఉన్నతాధికారులతో​ ఎమర్జెన్సీ మీటింగ్​ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇరాన్​వార్నింగ్​ఇచ్చింది.