భారత్, పాక్ యుద్ధాన్ని ఆపిన..అయినా నోబెల్ ప్రైజ్ రాదేమో! అమెరికా అధ్యక్షుడు ట్రంప్

భారత్, పాక్ యుద్ధాన్ని ఆపిన..అయినా నోబెల్ ప్రైజ్ రాదేమో! అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్  మధ్య యుద్ధాన్ని తాను ఆపలేదని, శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించలేదని ఇటీవలే వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్.. తాజాగా మాట మార్చారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపానని, అయినా తనకు నోబెల్  శాంతి బహుమతి రాదేమో అని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులకు మధ్యవర్తిత్వం వహించానన్నారు.

 ‘‘గత నెల ఇండియా, పాకిస్తాన్  మధ్య యుద్ధం ఆపాను. అయినా కూడా నాకు నోబెల్  ప్రైజ్  రాదు. అలాగే సెర్బియా, కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినా కూడా నాకు నోబెల్  ఇవ్వరు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పినా నోబెల్  ఇవ్వరు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను కుదిర్చినా. అయినా కూడా నాకు నోబెల్  ఇవ్వరు” అని ట్రంప్  తన సోషల్  మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. 

ఏమి చేసినా తనకు నోబెల్  శాంతి బహుమతి ఇవ్వరని వ్యాఖ్యానించారు. ‘‘రష్యా– ఉక్రెయిన్  వార్, ఇరాన్ – ఇజ్రాయెల్  యుద్ధం.. ఇలా ఏమైనా కావచ్చు. శాంతి కోసం ఏం చేసినా నాకు నోబెల్  ఇవ్వరని ప్రజలకు తెలుసు” అని ట్రంప్  పేర్కొన్నారు.