
వాషింగ్టన్ : అమెరికాకు అక్రమంగా వెళ్లిన ఇండియన్స్ ను అమెరికా గుర్తించింది. దాదాపు 161 మంది ఇండియన్స్ అమెరికాకు అక్రమంగా వచ్చినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసింది. త్వరలోనే వారిని ఇండియాకు పంపించనుంది. వీరంతా సౌత్ మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి ప్రవేశించారంట. అమెరికా అధికారులు పలు దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. చాలా దేశాల నుంచి అమెరికాలోకి మెక్సికో ద్వారా అక్రమంగా వస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికా అధికారులు పట్టుకున్న 161 మంది ఇండియన్స్ కు అక్కడ చట్టపరంగా అన్ని అవకాశాలు మూసుకోపోయాయి. దీంతో వారందరికీ త్వరలోనే పంజాబ్ లోని అమృత్ సర్ కు పంపించనున్నారు. అక్రమంగా వెళ్లిన వారిలో హర్యాన, పంజాబ్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్క హర్యానా నుంచి 76 మంది, పంజాబ్ కు చెందిన వారు 56 మంది ఉన్నారు. గుజరాతీయులు 12, యూపీకి చెందిన ఐదుగురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు చెందిన వారు ఇద్దరు. ఏపీ, గోవా నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. గతేడాది సైతం ఇలా అక్రమంగా అమెరికా వెళ్లిన 1616 మందిని అమెరికా తిరిగి పంపించింది.