అండర్‌–20 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ లో కాజల్‌ పసిడి పట్టు

అండర్‌–20 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ లో కాజల్‌ పసిడి పట్టు

సమోకోవ్‌ (బల్గేరియా): ఇండియా యంగ్‌ రెజ్లర్‌ కాజల్‌.. అండర్‌–20 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌ 72 కేజీ ఫైనల్లో కాజల్‌ 8–6తో యుకి లీయు (చైనా)పై గెలిచింది. హోరాహోరీగా సాగిన బౌట్‌లో ఇద్దరు రెజ్లర్లు ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే కీలక టైమ్‌లో కాజల్‌.. ప్రత్యర్థిని మ్యాట్‌కు అదిమి పట్టడంతో విజయం సాధ్యమైంది. 50 కేజీల్లో శ్రుతి 6–0తో జోసెఫిన్ వ్రెన్ష్ (జర్మనీ)ని ఓడించి బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. 

53 కేజీల్లో సారిక 11–0తో లోనా వాల్చుక్‌ (పోలెండ్‌)పై నెగ్గి  కాంస్యం నెగ్గింది.  మరోవైపు గ్రీకో రోమన్‌లో సూరజ్ కూడా బ్రాంజ్ అందుకున్నాడు. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అతను ఫ్రాన్స్ రెజ్లర్ లూకాస్ కెవిన్‌ను ఓడించాడు. కానీ,  అనూజ్ (67 కేజీ), నమన్‌ (97 కేజీ) నిరాశపర్చారు. క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌ లో అనూజ్ 0–9తో జాహోయన్‌ లియు (చైనా) చేతిలో, నమన్‌.. అండ్రెజ్‌ రాడిన్‌ (క్రొయేషియా) చేతిలో ఓడారు.