
శ్రీసింహా, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ డైరెక్షన్లో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన చిత్రం ‘ఉస్తాద్’. సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి దర్శకుడు రాజమౌళి, హీరో నాని అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
మరోవైపు శుక్రవారం సినిమా గురించి శ్రీసింహా మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైనా పనిలో ఎక్స్పర్ట్ని మనం ఉస్తాద్ అని పిలుస్తుంటాం. ఇది ఉర్దూ పదం. గురువును కూడా ఉస్తాద్ అని పిలుస్తుంటాం. ఇందులో హీరో బైక్ పేరు ఉస్తాద్. బైక్ వల్ల అతని లైఫ్లో చాలా విషయాలు జరుగుతాయి. తన ఎమోషన్స్ను బైక్ వల్ల కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అందుకే ఈ టైటిల్. నేను సూర్య అనే పాత్రలో కనిపిస్తా. కాలేజ్ స్టూడెంట్ నుంచి ఫైలట్ అయ్యే వరకు తన జర్నీనే కథ.
మూడు వేరియేషన్స్లో కనిపించడం చాలెంజింగ్గా అనిపించింది. జూనియర్స్ను చులకనగా చూసే ఓ సీనియర్ ఫైలట్గా గౌతమ్ మీనన్ కీలకపాత్ర పోషించారు. దర్శకుడు ఫణిదీప్ క్యారెక్టర్స్ను చక్కగా డిజైన్ చేశారు. నటుడిగా నాకు ఇది సంతృప్తినిచ్చిన సినిమా. నాన్న (కీరవాణి), బాబాయ్ (రాజమౌళి) సహా ఇంట్లోని వారందరూ వారి ఆలోచనలను చెబుతుంటారు. మంచి కథలను ఎంచుకోవటం నా చేతుల్లోనే ఉంటుంది. స్క్రిప్ట్ సెలక్షన్స్లో నాకేదైనా డౌట్ ఉంటే కార్తికేయ, భైరవన్నను అడుగుతుంటాను’ అని చెప్పాడు.