ప్రాజెక్టులు అప్పగించలేదు.. అప్పగించం: ఉత్తమ్ కుమార్

ప్రాజెక్టులు అప్పగించలేదు.. అప్పగించం: ఉత్తమ్ కుమార్
  • అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, అప్పగించబోమని ఇరిగేషన్  శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. సభను తప్పుదోవ పట్టించేలా మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రాజెక్టులను అప్పగించేందుకు కేంద్రానికి సమ్మతి తెలిపిందని హరీశ్​రావు సభ దృష్టికి తెచ్చారు. జనవరి 17, ఫిబ్రవరి 1న కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ సమావేశాల మినిట్స్​ను సభలో హరీశ్​ చదివి వినిపించారు. 

మంత్రి ఉత్తమ్​ జోక్యం చేసుకొని అదే మినిట్స్​లో రాష్ట్ర ఇరిగేషన్​ సెక్రటరీ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోబోమని చెప్పారని కూడా ఉందని, అది చదివి వినిపించాలన్నారు. స్పీకర్ ​సూచనతో మంత్రి ఉత్తమ్..​ మినిట్స్​చదివి వినిపించారు. ప్రాజెక్టులను అప్పగించలేదని ఉత్తమ్.. అప్పగించారని హరీశ్​ మినిట్స్​ను చదవడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మధ్యలో సీఎం రేవంత్​ జోక్యం చేసుకొని.. కేంద్రం వద్ద జరిగిన సమావేశాల్లో అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్​శాఖ మంత్రి హరీశ్​ రావు పాల్గొన్నారని, తాను, ఉత్తమ్​ఇంత వరకు ఢిల్లీలో నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని తెలిపారు. తాము ఢిల్లీకే వెళ్లనప్పుడు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని సీఎం ప్రశ్నించారు.