వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డి కస్టడీపై ఇవాళ విచారణ

వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డి కస్టడీపై ఇవాళ  విచారణ

వైశాలి కిడ్నాప్ కేసు లో నిందితుడు నవీన్ రెడ్డి కస్టడీపై ఇవాళ ఇబ్రహీంపట్నం కోర్టులో విచారణ జరగనుంది. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో మరో ఐదుగురుని ఒకరోజు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. A3-నాగారం భాను ప్రకాష్, A4- రాథోడ్ సాయినాధ్, A8- గానోజి ప్రసాధ్, A9- కోతి హరి, A30-బోని విశ్వేశ్వర్ లను కస్టడీ కి తీసుకొని అదిభట్ల పోలీసులు విచారించనున్నారు. 


నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ నిరాకరించినందునే వైశాలిని వేధించినట్లు నవీన్ రెడ్డి అంగీకరించాడు. వైశాలి స్నేహితురాలి ద్వారా తనకు ఆమె పరిచయమైందని నవీన్ పోలీసులకు చెప్పాడు. వైశాలితో కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాడినని, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రపోజల్ ను వైశాలి ముందు పెట్టానని అన్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో వైశాలి తండ్రికి విషయం చెప్పినా వారు కూడా అంగీకరించలేదని దీంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేధింపులు మొదలుపెట్టానని నవీన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు ఆమె ఇంటి ముందు ల్యాండ్ తీసుకుని షెడ్ వేశానని నవీన్ రెడ్డి చెప్పాడు. వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న తాను తన వద్ద పని చేసే వారందరిని తీసుకెళ్లి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు అంగీకరించాడు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు చెప్పాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్న విషయం తెలిసి వైశాలిని క్షేమంగా ఆమె ఇంటి వద్ద వదిలి తాను గోవాకు పారిపోయినట్లు నవీన్ రెడ్డి వెల్లడించాడు. వైశాలిపై అమితమైన ప్రేమ ఉన్నందునే ఆమెను క్షేమంగా ఇంటికి పంపించినట్లు పోలీసులకు చెప్పాడు.