- మన దేశ జీడీపీలో 71శాతానికి సమానం
- మొదటి స్థానంలో రిలయన్స్
- రెండో స్థానంలో టీసీఎస్
- హెచ్డీఎఫ్సీకి మూడోస్థానం
ముంబై : మనదేశానికి చెందిన టాప్ –500 ప్రైవేట్ రంగ సంస్థల విలువ 2.8 ట్రిలియన్ డాలర్లని (దాదాపు రూ. 231 లక్షల కోట్లు) వెల్లడయింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల మొత్తం జీడీపీకి సమానం. మనదేశం జీడీపీలో 71 శాతానికి సమానం. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 15.65 లక్షల కోట్ల వాల్యుయేషన్తో వరుసగా మూడో ఏడాది టాప్ స్లాట్లో కొనసాగుతోంది. కనీసం రూ. 13 లక్షల కోట్లతో టీసీఎస్నంబర్ 2 స్థానంలో ఉందని హురున్ ఇండియా- యాక్సిస్ బ్యాంక్ 2023 ‘అత్యంత విలువైన కంపెనీల జాబితా’ పేర్కొంది. దీని ప్రకారం, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనం వల్ల కొత్త సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది.
ఈ కంపెనీలు సంవత్సరంలో 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. అమ్మకాల విలువ 952 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది జాతీయ జీడీపీలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని హురున్ ఇండియా ఎండీ రెహమాన్ జునైద్ తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ, ఈ 500 కంపెనీలు దేశంలో 1.3 శాతం లేదా 70 లక్షలకు పైగా శ్రామికశక్తిని కలిగి ఉన్నాయని, వీటిలో 52 కంపెనీల వయసు దశాబ్దం కంటే తక్కువని చెప్పారు. ఈ జాబితాలోని ఈఐడీ ప్యారీ వయస్సు 235 సంవత్సరాలని ఆయన వివరించారు.
ఏ కంపెనీ ఏ స్థానంలో ఉందంటే..
ఈ జాబితాలో రిలయన్స్ రూ. 15.6 లక్షల కోట్లతో (అక్టోబర్ 2023 నాటికి), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 12.4 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 11.3 లక్షల కోట్లతో టాప్–3లో ఉన్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ జాబితాలో 28వ స్థానంలో ఉంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2023 ఎడిషన్లో టాప్–10 జాబితాలోకి తిరిగి వచ్చాయి. ఈ 500 కంపెనీల్లో 70 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సంస్థకు సగటున 15,211 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 437 మంది మహిళలు తమ బోర్డులలో ఉన్నారు.
వారిలో 179 మంది సీఈఓ లాంటి పెద్ద పోస్టుల్లో ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, ఐటీసీ వాల్యుయేషన్- రూ. లక్ష కోట్లు పెరిగింది. జాబితాలో సగానికి పైగా కంపెనీలు 2022లో రూ. 1,000 కోట్లకు పైగా వాల్యుయేషన్ను సాధించాయి. శాతం పరంగాచూస్తే సంవత్సరపు టాప్ విలువ సృష్టికర్తల లిస్టులో సుజ్లాన్ ఎనర్జీ మొదటిస్థానంలో ఉంది. జిందాల్ స్టెయిన్లెస్ , జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022లో దాదాపు ఐదు కంపెనీలు నాలుగు రెట్లు వృద్ధి చెందాయి.
మేఘా ఇంజనీరింగ్ (150), తయారీ సేవల స్టార్టప్ జెట్వర్క్ (100) బెన్నెట్ కోల్మన్ (100) కూడా భారీ వృద్ధిని సాధించాయి. వ్యాక్సిన్ తయారీదారు సీరమ్ ఇన్స్టిట్యూట్ వాల్యుయేషన్13 శాతం తగ్గి రూ. 1.9 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది దేశంలోనే అత్యంత విలువైన అన్లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతోంది. ముంబై (156), బెంగళూరు (59), న్యూఢిల్లీ (39) నేతృత్వంలోని 44 నగరాల నుంచి టాప్ 500 కంపెనీలు ఉన్నాయి.