న్యూఢిల్లీ: ప్రజలకిచ్చే ఉచిత పథకాల అంశంకంటే ముందు ఎంపీలకు ఇచ్చే పెన్షన్, ఇతర సదుపాయాల రద్దుపై పార్లమెంట్లో చర్చించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఉచితాల రద్దు అంశంపై చర్చించాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో ప్రతిపాదించడాన్ని ట్వీట్కు జతచేశారు. ‘‘ప్రజలకు అందే ఉచితాలపై చర్చించే ముందు మన గురించి కూడా మనం ఆలోచించాలి. ఎంపీలకు అందుతున్న సౌలతులు, పెన్షన్ల రద్దు అంశాన్ని డిస్కస్ చేస్తే బాగుంటుంది” అని పేర్కొన్నారు.
అదేవిధంగా.. పెరిగిన సిలిండర్ ధర వల్ల, నామ్కే వాస్తే సబ్సిడీ వల్ల ఉజ్వల స్కీమ్ లక్ష్యం నెరవేరట్లేదని వరుణ్గాంధీ మరో ట్వీట్లో పేర్కొన్నారు. గత ఐదేండ్లలో 4.13 కోట్ల మంది ఒక్క ఎల్పీజీని కూడా కొనుగోలు చేయలేదని, 7.67 కోట్ల మంది కేవలం ఒక్క ఎల్పీజీని మాత్రమే రీఫిల్ చేశారని ఆయన వివరించారు.