మెగా బ్యాగ్రౌండ్తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. డిఫరెంట్ కాన్సెప్టుల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఎనిమిదేళ్లలో పన్నెండు చిత్రాల్లో నటించి.. కొన్ని సక్సెస్లు, కొన్ని ఫెయిల్యూర్స్ ఖాతాలో వేసుకున్నాడు. మంచి నటుడనే కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన పదమూడో మూవీతో బాలీవుడ్కి కూడా పరిచయమవుతున్నాడు. ‘మేజర్’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ కలిసి వరుణ్తో భారీ యాక్షన్ డ్రామా రూపొందిస్తున్నాయి. సీనియర్ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు.
నిన్న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ముహూర్తపు షాట్కి దిల్ రాజు క్లాప్ కొట్టారు. వరుణ్ తల్లి పద్మజ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వారి సాహసాల్ని బిగ్ స్ర్కీన్పై చూపించే చాన్స్ రావడం గర్వంగా ఉంది. గ్రేట్ ఆఫీసర్స్ అందరికీ ఈ సినిమా గొప్ప నివాళి. నా క్యారెక్టర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నా’ అని చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ రూపొందనుంది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. వచ్చే యేడు విడుదలవుతుంది.