ఆమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘త్రి ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఇటీవల ఈ విషయాన్ని ఆమీర్ ఖాన్ స్వయంగా తెలియజేశారు. అయితే ఈ సీక్వెల్లో ఓ ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఫస్ట్ పార్ట్లోని మూడు పాత్రలకు తోడు మరో కీలకపాత్ర యాడ్ అవబోతోందట.
ఆ పాత్రను విక్కీ కౌశల్ పోషించబోతున్నట్టు సమాచారం. ఒరిజినల్ ‘త్రి ఇడియట్స్’ ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి తిరిగి తమ పాత్రలను పోషించనుండగా.. వీరికి తోడు నాలుగో ఇడియట్గా విక్కీ కౌశల్ చేరబోతున్నాడు. మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రాజ్కుమార్ హిరానీ ఈ సీక్వెల్ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు.
గతంలో రాజ్కుమార్ హిరానీ తీసిన సంజు, డంకీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన విక్కీ కౌశల్.. ఇప్పటికీ ఈ సీక్వెల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘త్రి ఇడియట్స్’ కథ ముగిసిన 10 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా సీక్వెల్ ఉంటుందని ఆమీర్ ఖాన్ వెల్లడించారు. స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సెకండాఫ్లో ఇది సెట్స్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
