
బషీర్బాగ్, వెలుగు : అధిక లాభాలు వస్తాయని ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్కు చెందిన బాధితులు బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు అనిల్, ఫరిద్ మాట్లాడుతూ... ఫనుక్ కంపెనీ పేరిట వెబ్ సైట్ నుంచి తమను సంప్రదించారని తెలిపారు.
కంపెనీ చూపించే ప్రొడక్టులపై పెట్టుబడి పెడితే నాలుగు రేట్లు లాభాలు వస్తాయని నమ్మించారు. స్కీమ్ లో కొత్తవారిని చేర్చితే రూ. 500 నుంచి రూ. 1000 వరకు కమీషన్ కూడా ఇచ్చారని తెలిపారు. చైన్ సిస్టమ్ గా సుమారు10 వేల మంది రూ. 500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారని పేర్కొన్నారు. మొదట కొద్దిగా ఇన్వెస్ట్ చేయగా లాభాలు ఇచ్చి, ఆపై లక్ష ఇన్వెస్ట్ చేస్తే 40 రోజుల్లో రోజుకు పది వేల చొప్పున 4 లక్షలు ఇస్తామని నమ్మించారని వివరించారు.
దీంతో ఒక్కొక్కరం లక్షకు పైగా పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. ఈనెల 26 నుంచి కంపెనీ వెబ్ సైట్ పని చేయడం లేదన్నారు. వాట్సప్ గ్రూప్ లో వెయ్యి మంది చొప్పున, 10 గ్రూప్ లను నిర్వహించారని పేర్కొన్నారు. గ్రూప్ అడ్మిన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. చాలా మంది అప్పులు చేసి ఇన్వెస్ట్ చేసి మోసపోయామని నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.