- రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ
- మైత్రీవనంలోని హెడ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు
- ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూల్స్కు విరుద్ధంగా హెచ్ఎండీఏ ఆఫీసర్లు బిల్డింగ్స్కు, వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో తేలింది. ఏకంగా 50 ఫైల్స్ మాయమైనట్లు గుర్తించారు. హెచ్ఎండీఏలో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రీవనంలోని హెచ్ఎండీఏ హెడ్ ఆఫీస్లో డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.
ప్రధానంగా హెచ్ఎండీఏ డైరెక్టర్ చాంబర్, ప్లానింగ్ డైరెక్టర్ ఆఫీస్ సహా రికార్డ్ సెక్షన్లలో తనిఖీలు జరిపినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ దర్యాప్తులో వెల్లడించిన వివరాల ఆధారంగానే విజిలెన్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం.
సోదాల కంటే ముందే..!
హెచ్ఎండీఏ హెడ్ ఆఫీసులోని 7వ అంతస్తులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డ్ సెక్షన్లో మ్యాన్యువల్ ఫైల్స్ కోసం తనిఖీలు చేశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్తో పాటు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, వెంచర్స్కు చెందిన ఫైల్స్ను సేకరించారు. ఈ సోదాల్లో హెచ్ఎండీఏ అధికారుల అక్రమాలు బయటపడ్డట్లు తెలిసింది. డైరెక్టర్లు, ప్లానింగ్ అధికారులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
సోదాల కంటే ముందే పలు ఫైల్స్ మాయం అయినట్లు అనుమానిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో దాదాపు 50కి పైగా బిల్డింగ్స్కు చెందిన మ్యాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్లు విజిలెన్స్ అనుమానిస్తున్నది. సంబంధిత అధికారుల నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. గత పదేండ్ల కాలంలో హెచ్ఎండీఏ పరిధిలో అనుమతులు పొందిన బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి ఆరా తీసినట్లు తెలిసింది. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్ట్కు రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది. సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లతో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది.