Vijay Ajith: 34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తలా, దళపతి.. లండన్‌లో అజిత్ రేసింగ్ ఎంజాయ్ చేసిన త్రిష, విజయ్ !

Vijay Ajith: 34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో తలా, దళపతి.. లండన్‌లో అజిత్ రేసింగ్ ఎంజాయ్ చేసిన త్రిష, విజయ్ !

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్, అజిత్ కుమార్ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. రేసింగ్‌పై ఆసక్తితో పోటీలో పాల్గొన్న అజిత్ కుమార్‌కు మద్దతుగా అక్కడికి వెళ్లిన విజయ్.. రేసును గ్రీన్ ఫ్లాగ్ ఊపి అధికారికంగా ప్రారంభించారు.

రేస్‌కు ముందు సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్‌ను కలిసిన విజయ్.. ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించడంతో పాటు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అలాగే అజిత్‌కు రేస్‌కు ముందు విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్, అజిత్ కలిసి కనిపించిన ఫోటోలు, రేసును విజయ్ ప్రారంభించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఈ అరుదైన క్షణాన్ని తెగ షేర్ చేస్తున్నారు..

CM విజయ్తో పాటు త్రిష కూడా..

ఈ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్తో పాటు నటి త్రిష కృష్ణన్ కూడా కనిపించారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం లండన్‌లో ఉన్న ఆమె.. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌కు వచ్చారు. తెల్లటి టాప్, బ్లూ జీన్స్, బ్రౌన్ జాకెట్‌లో త్రిష కనిపించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. దీంతో విజయ్, త్రిష కలిసి కనిపించిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంటోంది. వీరిద్దరి స్నేహంపై గతంలో పలు రకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ.. తమ సంబంధంపై విజయ్ లేదా త్రిష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

విజయ్, త్రిష గతంలో పలు సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తొలిసారి 2004లో ధరణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గిల్లి’ సినిమాలో జోడీగా కనిపించారు. ఆ తర్వాత ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’, ‘లియో’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో తమిళ సినిమాలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

34 ఏళ్ల తర్వాత కలిసిన స్టార్లు?

విజయ్, అజిత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం తమిళ సినీ అభిమానులకు నిజంగానే స్పెషల్ మూమెంట్‌గా మారింది. సినిమాల్లో ప్రత్యర్థి హీరోలుగా అభిమానుల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండటం మరోసారి ఈ వీడియోల ద్వారా కనిపించింది.

సిల్వర్‌స్టోన్‌లో అజిత్‌ను కలిసిన విజయ్.. ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం, రేసును స్వయంగా ప్రారంభించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. “34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు” అంటూ అభిమానులు ఈ అరుదైన క్షణాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

త్రిషతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ..

సిల్వర్‌స్టోన్ రేస్‌కు ముందు త్రిష.. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ను లండన్‌లో కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని రాధికా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అజిత్ రేసింగ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్‌ను కలిసిన రాధికా.. మోటార్‌స్పోర్ట్స్‌పై ఆయనకున్న ఆసక్తి, అంకితభావం, ఏకాగ్రతను ప్రశంసించారు. అజిత్ తన అభిరుచిని వృత్తిపరంగా కొనసాగిస్తూ సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అజిత్ టీమ్‌కు 38వ స్థానం..

ఇక రేసింగ్ విషయానికి వస్తే.. సిల్వర్‌స్టోన్ రౌండ్‌లో అజిత్ కుమార్‌కు చెందిన ‘అజిత్ రెడ్‌ఆంట్ బై విరాజ్’ టీమ్‌కు నిరాశ ఎదురైంది. రెండు గంటల పాటు జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో అజిత్, ఫ్రెంచ్ రేసర్ రొమైన్ వోజ్నియాక్ కలిసి నంబర్ 16 కారును నడిపారు.

అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌లో LMP3 Pro/Am విభాగంలో ఈ జోడీ 8వ స్థానంలో నిలిచింది. అయితే ప్రధాన రేసులో అదే జోరును కొనసాగించలేకపోయారు. చివరకు విజేత కంటే మూడు ల్యాప్‌లు వెనుకబడి ఓవరాల్‌గా 38వ స్థానంలో రేసును ముగించారు. దీంతో ఈ రౌండ్‌లో టీమ్‌కు ఎలాంటి పాయింట్లు దక్కలేదు. సిల్వర్‌స్టోన్ రేస్ అనంతరం అజిత్ రెడ్‌ఆంట్ బై విరాజ్ టీమ్ ఖాతాలో ప్రస్తుతం 21 పాయింట్లు ఉన్నాయి.

మొత్తానికి ఒకే వేదికపై విజయ్, అజిత్, త్రిష కనిపించడంతో ఈ రేసింగ్ ఈవెంట్‌కు మరింత సినీ గ్లామర్ వచ్చింది. ముఖ్యంగా విజయ్–అజిత్ భేటీ, విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపడం, త్రిష సిల్వర్‌స్టోన్‌లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.