
ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ ఉద్యోగం కోసం ఎంతోమంది కలలు కంటున్నారు. కానీ.. విజయ్ మాత్రం ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకుని ట్రెక్కింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరికైనా నచ్చిన పని చేస్తేనే కదా కిక్కు! అయితే.. విజయ్కి ట్రెక్కింగ్ వల్ల కిక్కుతోపాటు కావాల్సినంత డబ్బు కూడా వస్తోంది. అదెలాగంటే..
విజయ్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు. హిందీ మీడియం స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తైంది. ఆ తర్వాత పై చదువుల కోసం డెహ్రాడూన్కు వెళ్లాడు. ఉత్తరాఖండ్ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ . ఆ అందాలు విజయ్ని ఎంతగానో ఆకర్షించాయి. ముఖ్యంగా అక్కడి పర్వతాలు ఎక్కడం అతనికి హాబీగా మారిపోయింది. వీలైనప్పుడల్లా దగ్గర్లోని అడవులకు కూడా వెళ్లేవాడు. 2012లో ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో డిగ్రీ పూర్తి చేశాడు.
ఆ తర్వాత హైదరాబాద్లోని హెచ్సీఎల్లో ఉద్యోగం వచ్చింది. కానీ.. నార్త్ ఇండియాలో పుట్టి, పెరగడంతో సౌత్లో అడ్జస్ట్ కావడం కష్టమనిపించింది. ముఖ్యంగా ఫుడ్, లాంగ్వేజ్ ఇబ్బందిగా మారాయి. ఆ టైంలో ప్రకృతి అతనికి ఓదార్పునిచ్చింది. వీకెండ్స్లో రెగ్యులర్గా హైదరాబాద్కు దగ్గర్లోని అడవుల్లోకి వెళ్లేవాడు. విజయ్కి ఫొటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో వన్యప్రాణుల ఫొటోలు తీసేవాడు.
ఎదగాలనే ఆసక్తితో
డబ్బు కావాలంటే వృత్తిపరంగా కూడా ఎదగాలి అనుకున్నాడు విజయ్. అందుకే ఎంఏటీ (మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) రాసి, చండీగఢ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తర్వాత పుణెలోని కోటక్ మహీంద్రా బ్యాంక్లో పనిచేశాడు. కానీ.. అతని మనసు ఎప్పుడూ ట్రెక్కింగ్ మీదే ఉండేది. అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి వెళ్లేవాడు. అయితే.. విజయ్ ఆ టైంలో ట్రెక్కింగ్ని కేవలం సరదా కోసం చేసే పనిలా చూడలేదు. అంతకుమించి ఆలోచించాడు. ఆ ఆలోచనల నుంచే కొన్నాళ్లకు ‘అదే అడ్వెన్ థ్రిల్’ అనే స్టార్టప్ పుట్టింది.
ఉద్యోగం వదిలేసి..
లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ట్రెక్కింగ్ ద్వారానే డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కొన్నాళ్ల పాటు రీసెర్చ్ చేసి, ఉద్యోగం మానేసి చివరకు అడ్వెన్ థ్రిల్ స్టార్టప్ పెట్టాడు. దీని ద్వారా కాలేజీ స్టూడెంట్స్, యువకులు, ఉద్యోగస్తులను ట్రెక్కింగ్కి తీసుకెళ్తుంటాడు. తన ఐటీ ఫ్రెండ్స్ సాయంతో కంపెనీ కోసం ఒక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేశాడు. కంపెనీ పనులన్నీ సజావుగా సాగడానికి కొంతమంది మేనేజ్మెంట్ ఇంటర్న్లను కూడా నియమించుకున్నాడు. కానీ 80% పని తానే చూసుకుంటాడు.
మొదటి ఎక్స్పీరియెన్స్
అప్పటికే విజయ్కి ట్రెక్కింగ్లో చాలా అనుభవం ఉంది. కానీ.. ఒక గ్రూప్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియెన్స్ లేదు. ట్రెక్ లీడర్గా విజయ్ ప్రయాణం డిసెంబర్ 2016లో న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి మొదలైంది. అక్కడినుంచి 12 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని చోప్తా తుంగ్నాథ్ అనే మంచు పర్వతం ట్రెక్కింగ్కు తీసుకెళ్లాడు. ఆ గ్రూప్లోని చాలామంది ఇప్పటికీ రెగ్యులర్గా ‘అడ్వెన్ థ్రిల్’ ద్వారా ట్రెక్కింగ్ చేస్తున్నారు.
మొదటి ఎక్స్పీరియెన్స్లో తను ఈ వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి అని తెలుసుకున్నాడు. ముఖ్యంగా స్కిల్స్తో పాటు టెక్నాలజీ వాడకం లాంటివి డెవలప్ చేసుకోవాలి అనిపించింది. అందుకే నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో ‘మౌంటెనీరింగ్ కోర్స్’ పూర్తి చేశాడు. ఆ తర్వాత మాజీ ఆర్మీ మెంటార్స్తో సహా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది ట్రెక్ లీడర్స్తో ఒక నెట్వర్క్ను నిర్మించాడు. దాంతో నెమ్మదిగా ట్రెక్కర్ల నుంచి బుకింగ్స్ పెరిగాయి.
కరోనా ఎఫెక్ట్
అంతా బాగానే సాగుతోంది అనుకునేలోపే కరోనా వచ్చింది. ‘‘అప్పటికే నేను బిజినెస్లోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. చాలా ప్లానింగ్స్ చేశా. కానీ.. కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి” అని గుర్తుచేసుకున్నాడు విజయ్. అయినా.. విజయ్ వర్చువల్ మారథాన్(వాళ్లు ఉంటున్న ప్లేస్లోనే రన్నింగ్ చేసే ఆన్లైన్ ఈవెంట్స్)లను నిర్వహించాడు. వాటిలో పాల్గొన్నవాళ్లకు బహుమతులు ఇచ్చాడు.
అలా అడ్వెన్ థ్రిల్ గురించి అందరికీ తెలిసేలా చేశాడు. దాంతో కరోనా తర్వాత బుకింగ్స్ బాగా పెరిగాయి. విజయ్ కొంతమందితో ఒక పెద్ద టీమ్ని ఏర్పాటు చేశాడు. అందులో రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్న 10 మంది సభ్యులు, కొందరు సర్టిఫైడ్ ఫస్ట్ ఎయిడ్ రెస్పాండర్స్ కూడా ఉన్నారు. అంతేకాదు.. ప్రస్తుతం విజయ్ తన స్టార్టప్ ద్వారా బేసిక్, అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాడు.
ఫ్రీలాన్సర్లతో
ట్రెక్కింగ్కి తీసుకెళ్లడమనేది సీజనల్ బిజినెస్. కాబట్టి కంపెనీని ఫ్రీలాన్సర్లతోనే నడిపిస్తున్నాడు. అంటే చేసే పని ఆధారంగా వాళ్లకు డబ్బు ఇస్తుంటాడు. ట్రెక్కు వెళ్లే గ్రూప్ పరిమాణం ఆధారంగా ఫ్రీలాన్సర్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం లాంటివి చేస్తుంటాడు. ఇలా స్టార్టప్ నడపడానికి అయ్యే ఖర్చుని చాలావరకు తగ్గించుకున్నాడు.
ట్రెక్కింగ్కి ఎవరైనా వెళ్లొచ్చా?
ట్రెక్కింగ్ చేయాలనే ఇష్టం ఉంటే సరిపోదు.. అందుకోసం కొన్ని అర్హతలు ఉండాలి. అలా ఉంటేనే అడ్వెన్ థ్రిల్లో బుకింగ్కి అవకాశం ఇస్తారు. ట్రెక్కింగ్కి వెళ్లాలి అనుకునేవాళ్లు ముందుగా సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ‘‘బుకింగ్ని కన్ఫర్మ్ చేయడానికి ముందు డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తాం. అందుకే మేము ఒక నెల ముందుగానే రిజిస్ట్రేషన్లు తీసుకుంటాం. ట్రెక్కర్ల ఫిట్నెస్ను అంచనా వేయడానికి మాకు కొంత టైం పడుతుంది.
ట్రెక్కింగ్ చేసేవాళ్లు అంతకుముందు కనీసం 20 రోజులపాటు ఇంట్లో ఫిట్నెస్ డైలీ రొటీన్ని అనుసరించాలి. ట్రెక్కింగ్ మొదలయ్యాక కూడా ప్రతిరోజూ కొన్ని మెడికల్ చెకప్స్ చేస్తాం. ఆక్సిజన్ లెవల్స్, బీపీ లాంటివన్నీ కంట్రోల్లో ఉంటేనే మాతో తీసుకెళ్తాం. లేదంటే బేస్ క్యాంప్లో ట్రీట్మెంట్ చేయిస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.
15 మందికి 12 మంది
15 మంది ట్రెక్కర్ల బృందానికి కంపెనీ ముగ్గురు ట్రెక్ లీడర్లను నియమిస్తుంది. ఒకరు(అసిస్టెంట్ ట్రెక్ లీడర్) బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు చేసినవాళ్లు, మరొకరు (ట్రెక్ లీడర్) అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు చేసినవాళ్లు ఉంటారు. ఒక రెస్క్యూ ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు. వీళ్లతోపాటు ఒక కుక్, ఇద్దరు హెల్పర్స్, పోర్టర్లు వెళ్తారు. ఇలా ఒక సురక్షితమైన ట్రెక్ పూర్తి చేసేందుకు మొత్తంగా 12 మంది సిబ్బంది పనిచేస్తారు.
ఇది వ్యాపారం మాత్రమే కాదు..
‘‘నాకు ట్రెక్కింగ్ అనేది వ్యాపారం మాత్రమే కాదు.. ఇది నా డ్రీమ్ మిషన్. భద్రత, నైతిక విలువలు పాటిస్తూ ఇండియాని ప్రపంచ ట్రెక్కింగ్ పటంలో ఉండేలా చేయడమే నా లక్ష్యం. గత ఎనిమిది సంవత్సరాల్లో మా కంపెనీ ద్వారా లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, నేపాల్లలో ట్రెక్లను నిర్వహించాం. అయినా.. ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ. పది కోట్లే. గత సంవత్సరం రూ. 45 లక్షలు మాత్రమే వచ్చింది. దానికి కారణం.. క్వాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడమే. ఎన్ని కావాలంటే అన్ని ట్రెక్స్కి బుకింగ్స్ తీసుకోవచ్చు. కానీ.. సేఫ్టీ విషయంలో రాజీ పడకూడదనే కారణంతో సంవత్సరానికి 10 నుంచి 20 ట్రెక్లు మాత్రమే నిర్వహిస్తున్నాం.
మూడు లెవల్స్
బిగినర్స్: వీళ్లను 3,500 మీటర్ల వరకు తీసుకెళ్తారు. రోజూ నాలుగు నుండి ఐదు గంటలు నడవగల కెపాసిటీ ఉండాలి.
మోడరేట్: 3,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తారు. కనీసం ఐదు సార్లు బిగినర్స్ లెవల్ ట్రెక్ల్లో పాల్గొని ఉండాలి.
డిఫికల్ట్: 5,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్తారు. ఈ ట్రెక్కి వెళ్లాలంటే పర్వతారోహణ కోర్సు సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.