హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయసేన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రాంగణంలో చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. విజయసేన్ రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది.
విజయసేన్ రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాసు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ గా, లోకాయుక్తగా సేవలందించారు. 1994 డిసెంబరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, సర్వీసు, భూసేకరణ, ఆర్బిట్రేషన్, పౌరసరఫరాలకు చెందిన కేసులను వాదించారు.

