కోహ్లీ వందో టెస్టుకు నో ఫ్యాన్స్
మొహాలీ: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వందో టెస్టును ఖాళీ స్టేడియంలోనే ఆడనున్నాడు. మొహాలీ వేదికగా మార్చి 4న ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ను లైవ్ గా వీక్షించాలని ఫ్యాన్స్ అనుకున్నా అది కుదిరేలా లేదు. పంజాబ్ క్రికెట్అసోసియేషన్ (పీసీఏ) ఈ టెస్టుకు ఫ్యాన్స్కు అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. కరోనా నేపథ్యంలో స్టేడియంలోకి ఫ్యాన్స్ ను అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది. దీంతో కోహ్లీ అభిమానులకు నిరాశే మిగిలింది. ‘బీసీసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం గ్రౌండ్ డ్యూటీ నిర్వహిస్తున్న వారికి తప్ప స్టేడియంలోకి సాధారణ ప్రేక్షకులకు ఎంట్రీ లేదు. మొహాలీ ప్రాంతంలో ఇప్పటికీ కొత్త కరోనా కేసులు వస్తున్న దృష్ట్యా ప్లేయర్స్ సేఫ్టీ కొరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడేళ్ల తర్వాత ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నందున ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకపోవడం వారికి కాస్త నిరాశ కలిగించొచ్చు. కోహ్లీకి ఇది వందో టెస్టు అయినందుకు స్టేడియం దగ్గర పెద్ద బిల్ బోర్డులు ఏర్పాటు చేస్తాం. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అతడిని సత్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని మ్యాచ్ ప్రారంభంలో నిర్వహించాలా.. లేక పూర్తయ్యాక జరపాలా అనేది బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్తాం’ అని పీసీఏ ట్రెజరర్ ఆర్పీ సింగ్లా చెప్పారు.