టెన్నిస్కు గుడ్ బై చెప్పిన రోజర్ ఫెదరర్కు శుభాకాంక్షలు తెలుపుతూ..టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. తాను చూసిన మేటి అథ్లెట్లలో రోజర్ ఫెదరర్ ఒకరని కోహ్లీ ప్రశంసించాడు. ఫెదరర్ కు ఎవరూ సాటి రారని మెచ్చుకున్నాడు. జీవితంలో కొత్త దశను పూర్తి ఆస్వాదించాలని..ఫెదరర్..జీవితం మరింత సంతోషంగా నిండిపోవాలని కోహ్లీ అకాంక్షించాడు.
ఎప్పటికీ..అత్యుత్తమ ఆటగాడివే..
హలో రోజర్, నాకు అందమైన క్షణాలను..ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన నీ కెరీర్ను అభినందిస్తూ వీడియో సందేశాన్ని పంపిస్తున్న. ఇదే నాకు గౌరవంగా భావిస్తున్నాను. 2018 ఆస్ట్రేలియా ఓపెన్లో నిన్ను కలవడాన్ని ఎప్పటికీ మరచిపోలేను. టెన్నిసే కాకుండా..వరల్డ్ వైడ్గా నీకు లభిస్తున్న మద్దతు.. సంఘీభావం.. మరే అథ్లెట్ విషయంలో నేను చూడలేదు. నాకు నువ్వెప్పుడూ అత్యుత్తమ అటగాడివే.. అని ఫెదరర్ను కోహ్లీ వీడియో సందేశం పంపాడు. ఫెదరర్ను ఉద్దేశించి కోహ్లీ మాట్లాడిన ఈ వీడియోను ఏటీపీ టూర్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
థాంక్యూ కోహ్లీ..
కోహ్లీ వీడియో సందేశానికి రోజర్ ఫెదరర్ స్పందించాడు. "ధన్యవాదాలు @virat.kohli. త్వరలో భారత్కు రావాలని ఆశిస్తున్నాను" అని ఫెదరర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
నాదల్తో కలిసి ఆఖరి మ్యాచ్..
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. లండన్ వేదికగా లేవర్ కప్-2022లో రఫేల్ నాదల్తో కలిసి ఫెదరర్ ఆఖరి మ్యాచ్ ఆడాడు. టీమ్ యూరోప్ తరఫున బరిలోకి దిగిన నాదల్, ఫెదరర్ జంట...టీమ్ వరల్డ్కు చెందిన జాక్ సాక్, ఫ్రాన్సిస్ టియాఫో చేతిలో ఓడిపోయింది. ఓటమితో కెరీర్కు వీడ్కోలు పలికిన ఫెడెక్స్ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నాదల్ సైతం కన్నీటి పర్యంతమయ్యాడు.