- మార్చి క్వార్టర్తో పోలిస్తే రెండింతలకు పైగా గ్రోత్
- రెవెన్యూ రూ. 446.84 కోట్లు
హైదరాబాద్, వెలుగు: బిల్డింగ్ మెటీరియల్స్ను తయారు చేసే విశాక ఇండస్ట్రీస్కు ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 12.26 కోట్ల నికర లాభం వచ్చింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ.5 కోట్ల కంటే రెండింతలకు పైగా పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో రూ.38.63 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్యూ1 లో కార్యకలాపాల ద్వారా రూ. 446.84 కోట్ల రెవెన్యూ సాధించింది. ఈ నెంబర్ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ.450.10 కోట్లుగా ఉంది.
కిందటేడాది జూన్ క్వార్టర్లో రూ.479.22 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం క్యూ1 లో రూ. 36.92 కోట్లను విశాక ఇండస్ట్రీస్ ఖర్చు చేసింది. కంపెనీ మొత్తం ఖర్చులు జూన్ క్వార్టర్లో రూ.432.41 కోట్లుగా రికార్డయ్యాయి. సెగ్మెంట్ వైజ్గా చూస్తే, బిల్డింగ్ ప్రొడక్ట్స్ విభాగం నుంచి కంపెనీకి రూ.384.79 కోట్లు, సింథటిక్ బ్లెండెడ్ యార్న్ సెగ్మెంట్ నుంచి రూ.62.05 కోట్ల రెవెన్యూ పొందింది. బిల్డింగ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ నుంచి జూన్ క్వార్టర్లో రూ.27.13 కోట్ల ఇబిటా సాధించగా, సింథటిక్ బ్లెండెడ్ యార్న్ సెగ్మెంట్ నుంచి రూ.7.9 కోట్లు పొందింది.
కన్సాలిడేటెడ్ బేసిస్లో విశాక ఇండస్ట్రీస్కు జూన్ క్వార్టర్లో రూ.448.5 కోట్ల ఆపరేషనల్ రెవెన్యూ, రూ.11.95 కోట్ల నికర లాభం వచ్చాయి. కిందటేడాది జూన్ క్వార్టర్లో కంపెనీకి రూ.479.69 కోట్ల రెవెన్యూ, రూ. 38.52 కోట్ల నికర లాభం వచ్చాయి. విశాక ఇండస్ట్రీస్ షేర్లు బుధవారం సెషన్లో అర శాతం నష్టపోయి రూ.91 దగ్గర సెటిలయ్యాయి. కాగా, కంపెనీ తమ షేర్ల ఫేస్ వాల్యూని రూ.10 నుంచి రూ.2 కి ఈ ఏడాది మేలో స్ప్లిట్ చేసిన విషయం తెలిసిందే.