
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జైషే ఉగ్రవాదులు నలభై మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని బాలాకోట్లో ఉగ్రశిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. ఉగ్రవాదులే టార్గెట్ గా మిరాజ్ యుద్ధ విమానాలతో భారత్ ఎయిర్ఫోర్స్ బాంబుల వర్షం కురి పించింది. దీనిని కథాంశంగా చేసుకుని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం వెండితెరకెక్కనుంది. బాలాకోట్-ది ట్రూ స్టోరీ పేరుతో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన పలు మూవీల్లో వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఆ మధ్య టైటిల్ పాత్రలో నటించడమే కాకుండా ఆయన నిర్మించిన నరేంద్రమోడీ సినిమా ఈ ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి ఆయన మనదేశ ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ దాడుల నేపథ్యంతో సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని అనుమతులను ఆయన తీసుకున్నారట.
ఈ ఏడాది ఆఖరులో సినమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్, ఢిల్లీ,ఆగ్రా ల్లో షూటింగ్ జరపనున్నారు. త్వరలోనే నటీనటులు, దర్శకుడు ఎవరనే అంశాలను ప్రకటిస్తారు. ఈ చిత్రంలో భారత్ వాయుసేన ధైర్య సాహసాలను చూపించడంతో పాటు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాత్రను కూడా చూపించనున్నారట.