బీజేపీ వచ్చాక అధికారికంగా విమోచన దినోత్సవం: వివేక్ వెంకటస్వామి

బీజేపీ వచ్చాక అధికారికంగా విమోచన దినోత్సవం: వివేక్ వెంకటస్వామి

 

  • రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: వివేక్ వెంకటస్వామి
  • ప్రధాని మోదీ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
  • సమిష్టి కృషితో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగామని వెల్లడి

హనుమకొండ/వరంగల్, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్రం ఏర్పడినా విమోచనంపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతేడాది అమిత్ షా నేతృత్వంలో వేడుకలను నిర్వహించినట్టు చెప్పారు. మంగళవారం హనుమకొండలో మీడియాతో వివేక్‌‌ మాట్లాడారు. తర్వాత సిటీలో జరిగిన బీజేపీ ఉమ్మడి వరం గల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఆ విశ్వాసంతో రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. మోదీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారని, జీ20 సదస్సు ద్వారా దేశంలో ఎంప్లాయ్‌‌మెంట్, బిజినెస్ కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. 

అమరులను కించపర్చడానికే సమైక్యతా దినోత్సవం

నిజాంపై పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరు లను కించపరిచేలా ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త రాగం ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర హోం మంత్రి వచ్చి విమోచన దినోత్సవం నిర్వహిస్తుండడం వల్లే విధిలేక సమైక్యతా దినోత్సవం పేరుతో ప్రభుత్వం నాటకామాడుతోందన్నారు. నిరుద్యోగ సమస్యపై బుధవారం హైదరాబాద్​లో ఇందిరాపార్కు వద్ద 24 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్​లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, వరంగల్ పార్లమెంట్ ఇన్‌‌చార్జి వి.మురళీధర్ గౌడ్, హనుమకొండ జిల్లా ఇన్‌‌చార్జ్ అడ్లూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాములు, శ్రీధర్, నాయకులు దేశిని సదానందం గౌడ్, ఆర్పీ జయంత్ లాల్, సాంబయ్య, రత్నం సతీష్ షా, శ్రీరాంరెడ్డి, చల్లా జైపాల్ రెడ్డి, వెంకటరమణ, వీసం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్ కుట్రలు తిప్పి కొట్టాలి..

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్ కుట్రలను తిప్పి కొట్టాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. గతంలో 8 శాతం మాత్రమే ఉన్న బీజేపీ ఓట్లు ఇప్పుడు 30 శాతానికి పైగా పెరిగాయని, దీంతో కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. నాలుగేండ్లలో బీఆర్ఎస్‌‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచినట్టు గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్‌‌లో 12 స్థానాలు గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయాలని కోరారు.