
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనర్ల (ఏసీల) తయారీ కంపెనీ వోల్టాస్ 2023–24 లో 20 లక్షలకు పైగా రూమ్ ఏసీలను అమ్మింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 35 శాతం గ్రోత్ నమోదు చేసింది. కూలింగ్ అప్లియెన్స్లకు మంచి డిమాండ్ ఉండడంతో కంపెనీ సేల్స్ ఊపందుకున్నాయని ఈ టాటా గ్రూప్ కంపెనీ వెల్లడించింది. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ అమ్మకాలు పెరిగాయని తెలిపింది. ఇండియాలో రికార్డ్ లెవెల్ అమ్మకాలు జరిపిన మొదటి ఏసీ కంపెనీగా నిలిచామని వోల్టాస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇండియన్ రెసిడెన్షియల్ ఏసీ మార్కెట్లో 2023–24 లో కోటి ఏసీలు అమ్ముడయ్యాయి. పస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 1.15 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఏసీల సేల్స్ తక్కువగా ఉండే జనవరి–మార్చి క్వార్టర్లో కూడా వోల్టాస్ అమ్మకాలు 72 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి. రూమ్ ఏసీల సెగ్మెంట్లో లీడర్గా కొనసాగుతున్నామని వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షి అన్నారు. మరోవైపు టర్కిష్ అప్లియెన్సెస్ మేకర్ అర్సెలిక్తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ బ్రాండ్ వోల్టాస్ బెకో కూడా 2023–24 లో 20 లక్షల యూనిట్లను సేల్ చేసింది.