వనపర్తి/పెద్దమందడి, వెలుగు: మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా, పెద్దమందడి, ఖిల్లా గణపురం మండలాల్లోని ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణను, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఓటు కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు.
పోలింగ్ సమయంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రూల్స్ పక్కాగా పాటించాలని ఉద్యోగులకు సూచించారు. పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో పరిణత, గణపురం తహసీల్దార్ సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి పాల్గొన్నారు.

