
- 5 నెలల గరిష్టానికి క్రూడాయిల్ ధర
- బ్యారెల్కు 78 డాలర్లను తాకిన బ్రెంట్
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో శుక్రవారం 9 శాతం అప్
- కీలక సప్లయ్ రూట్ను ఇరాన్ బ్లాక్ చేస్తే ధరలు మరింతే పెరిగే ఛాన్స్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర శుక్రవారం మార్నింగ్ 9 శాతానికి పైగా పెరిగింది. ఐదు నెలల గరిష్టమైన 78 డాలర్లను ( బ్యారెల్కు) టచ్ చేసింది. ఆ తర్వాత కొంత తగ్గి 74 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, మిస్సైల్స్ తయారీ ప్లాంట్లపై దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్లో జియోపొలిటికల్ టెన్షన్స్ మరింత పెరిగాయి.
మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దాడుల్లో తమ పాత్రేమీ లేదని ప్రకటించారు. కానీ, యూఎస్, ఇరాన్ మధ్య నూక్లియర్ డీల్ కుదరకపోయిన తర్వాత ఈ దాడులు జరగడాన్ని గమనించాలి. ఇరాన్ రోజుకు 3.3 మిలియన్ బ్యారెల్స్ (ఎంబీపీడీ) క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్లో 3 శాతానికి సమానం. సుమారు 1.5 ఎంబీపీడీని ఎగుమతి చేస్తోంది.
ఇందులో 80 శాతం చైనాకు, మిగిలినది టర్కీ వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇరాన్ కీలక రూట్ అయిన పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఈ రూట్లో 20 ఎంబీపీడీ ఆయిల్ ట్రేడ్ జరుగుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ కూడా తమ ఆయిల్ను ఈ రూట్లో నుంచి రవాణా చేస్తున్నాయి. స్ట్రాట్ ఆఫ్ హోర్ముజ్/పర్షియన్ గల్ఫ్ రూట్ను బ్లాక్ చేస్తామని ఇరాన్ గతంలో హెచ్చరించింది. అదే జరిగితే సౌదీ, ఇరాక్, కువైట్, యూఏఈ వంటి దేశాల ఆయిల్ సప్లయ్పై ప్రభావం పడుతుంది.
దీంతో క్రూడాయిల్ ధరలు మరింత పెరగొచ్చు. వెస్ట్రన్ దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా ఇరాన్ నుంచి చైనా ఆయిల్ కొంటుండగా, ఇండియా మాత్రం పెద్దగా క్రూడాయిల్ను దిగుమతి చేసుకోవడం లేదు. మరోవైపు జులైలో ఒపెక్ ప్లస్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతామని ప్రకటించాయి. ఇరాన్ ఆయిల్ సప్లయ్ పడిపోయినా, ఎటువంటి నష్టం ఉండదని అంచనా. అదే జరిగితే ఆయిల్ ధరలు భారీగా పెరగకపోవచ్చు.