న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా జింబాబ్వే ప్లేయర్లు ఇండియాలోనే ఆగిపోయారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ముగియడంతో సోమవారం బ్యాచ్ల వారిగా ప్లేయర్లు జింబాబ్వే బయలుదేరాల్సి ఉంది. కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్ను మూసి వేయడంతో అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ సేవలన్నీ నిలిచిపోయాయి. దాంతో క్రికెటర్ల ప్రయాణంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆల్రౌండర్ క్రీమర్ దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. అతని ప్రయాణంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది.
‘మేం టోర్నీ మొదలుపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు దిగజారుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మా ప్రయాణంపై స్పష్టత రావడం లేదు’ అని హెడ్ కోచ్ జస్టిన్ సమ్మన్స్ పేర్కొన్నాడు. మరోవైపు అబుదాబిలో పాకిస్తాన్ షాహీన్స్, ఇంగ్లండ్ లయన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ను అధికారులు రద్దు చేశారు. ప్లేయర్లందరూ హోటల్కే పరిమితమయ్యారు.
