- వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి
కాశీబుగ్గ, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి సూచించారు. శుక్రవారం వరంగల్ జిల్లా జక్కలొద్ది గ్రామంలోని టీజీఎంఆర్ఈఐఎస్ స్కూల్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని, దీంతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, పాదచారుల భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలన్నారు.
చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేశ్, డీఈవో రంగయ్య నాయుడు, ఎంవీఐ జైపాల్ రెడ్డి, మామునూరు ఎస్సై శ్రీకాంత్, తహసీల్దార్ ఇక్బాల్, ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు.
