- గత ప్రభుత్వం అంచనాలను రూ.1726 కోట్ల నుంచి
- రూ.1371 కోట్లకు తగ్గించిన కాంగ్రెస్ సర్కారు
- గ్రానైట్కు బదులు టైల్స్, ఎలివేషన్లో మార్పుల వల్ల రూ.వెయ్యి కోట్లు మిగులు
- జూన్కల్లా ప్రారంభించే లక్ష్యంతో ముందుకు
- డాక్టర్స్, సిబ్బంది నియామకానికి నేడో రేపో నోటిఫికేషన్
వరంగల్, వెలుగు: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ లెవల్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ దాదాపు పూర్తికావచ్చింది. -ఈ జూన్కల్లా పెండింగ్ పనులను కంప్లీట్చేసి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2021 ఏప్రిల్, మే నెలల్లో సెంట్రల్ జైలును కూల్చివేయించిన నాటి బీఆర్ఎస్ సర్కారు, జూన్ 21న ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేసింది.
ఏడాది తిరిగేలోగా పనులు పూర్తిచేసి ప్రారంభిస్తానని నాటి సీఎం హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు స్పీడందుకోగా, ప్రస్తుతం సుమారు 400 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రాబోయే జూన్ కల్లా హస్పిటల్అందుబాటులోకి రానుండగా, ఆ లోపే డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
రూ.వెయ్యి కోట్ల వ్యయం తగ్గింది..
వరంగల్ సెంట్రల్ జైల్కు చెందిన 57 ఎకరాల్లో రూ.1,116 కోట్లతో హస్పిటల్ నిర్మిస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కారు, ఇందుకోసం జైలు భూములను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తాకట్టు పెట్టి రూ.1,173 కోట్ల లోన్తీసుకుంది. మధ్యలోనే అంచనా వ్యయాన్ని మరో రూ.610 కోట్లకు పెంచింది. పెరిగిన అంచనా వ్యయంపై సీఎం రేవంత్రెడ్డి ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ప్రభుత్వం పెంచిన అంచనా వ్యయాన్ని కాంగ్రెస్ సర్కారు రూ.1726 కోట్ల నుంచి రూ.1371 కోట్లకు తగ్గించి, నిర్మాణానికి అప్రూవల్స్ ఇచ్చింది. అదే సమయంలో హాస్పిటల్ బిల్ట్అప్ ఏరియాను 16,50,003 ఎస్ఎఫ్టీ నుంచి 19,70,605 ఎస్ఎఫ్టీలకు, హాస్పిటల్ బెడ్లను 1750 నుంచి 2018కి పెంచడం విశేషం. అదే సమయంలో గత ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణంలో గ్రానైట్ ఫ్లోర్ వేయాలని భావించగా, ప్రస్తుతం టైల్స్వైపు మొగ్గు చూపారు.
లక్షలాది స్వ్కేర్ ఫీట్లలో గ్రానైట్ బరువు తగ్గించడం ద్వారా దాదాపు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లు కలిసివచ్చిందని అధికారులు అంటున్నారు. దీంతోపాటు సినిమా సెట్టింగ్ తరహాలో ఉండే ఎలివేషన్ తగ్గించడం ద్వారా మరో రూ.200 నుంచి 300 కోట్లు నిర్మాణ ఖర్చును ఆదా చేసినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న చర్యల వల్ల ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక భారం తగ్గిందని వివరిస్తున్నారు.
చివరిదశ పనులను స్పీడప్ చేసినం..
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జూన్ నెలలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచనతో ఉంది. దీంతో గడువులోగా పెండింగ్ పనులు పూర్తిచేసేలా పనులు స్పీడప్చేశాం. అన్నిశాఖల సిబ్బందిని కోఆర్డినేట్ చేస్తూ షిఫ్టులవారీగా 24గంటలు పనులు చేయిస్తున్నాం. మావంతుగా సకాలంలో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుపోతున్నం. – డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్
