విరాట్ కోహ్లీ నా కలలోకి కూడా వస్తున్నాడు: వసీం అక్రమ్‌

విరాట్ కోహ్లీ నా కలలోకి కూడా వస్తున్నాడు: వసీం అక్రమ్‌

కోహ్లీ.. కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరొక బ్రాండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ చూసే వీక్షుకులు మొదలు.. క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన క్రికెటర్ల వరకూ అందరూ అతని అభిమానులే. నమ్మడం లేదా! ఇదిగో.. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ చెప్పిన ఈ రెండు వ్యాఖ్యలే ప్రపంచవ్యాప్తంగా అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు పదే పదే వరుణుడు అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 24.1 ఓవర్ల వద్ద ఎంట్రీ ఇచ్చిన వరుణుడు.. రిజర్వ్ డే రోజు భారత ఇన్నింగ్స్ ముగిశాక మరోసారి దర్శమిచ్చాడు. వర్షం విరామ సమయంలో స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడిన అక్రమ్.. తనను కోహ్లీ కలలు వెంటాడుతున్నాడని తెలిపాడు. అతనికి ఉన్న అపారమైన ప్రజాదరణ తనకు నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తోందని చెప్పుకొచ్చారు. కోహ్లీపై తన కలలోకి వస్తున్నాడని చెప్పడమే కాకుండా.. అలా ఎందుకు కనిపిస్తున్నాడో వివరణ కూడా ఇచ్చారు.

"విరాట్‌ వద్దకు వెళ్లి నా కలల్లో కూడా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పా. అందుకు అతడు "ఏమంటున్నావు వసీమ్‌ భాయ్‌?" అని అడిగాడు. అందుకు నేను టీవీల్లో ఎక్కడ చూసినా.. ఏ స్క్రీన్ మీద చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నా మనసులోంచి నిన్ను తీసేయలేక పోతున్నానని చెప్పా.." అని అక్రమ్ వెల్లడించారు.

కాగా, పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న సూప‌ర్ 4 మ్యాచ్‌లో కోహ్లీ(122) మరో సెంచ‌రీ బాదాడు. దీంతో తన వ‌న్డే కెరీర్ లో 47వ శ‌త‌కంతో పాటు 13వేల క్ల‌బ్‌లో చేరాడు.