హైదరాబాద్ శివారులో వాటర్ పరేషాన్ .. సమ్మర్ సీజన్లో కొరత

హైదరాబాద్ శివారులో వాటర్  పరేషాన్ .. సమ్మర్ సీజన్లో కొరత

హైదరాబాద్, వెలుగు: సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఎండలు ముదురుతుండగా.. సిటీలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. డిమాండ్​కు సరిపడా నీటిని పంపిణీ చేస్తామని వాటర్​బోర్డు చెబుతున్నా ఆచరణలో చూపడంలేదు. దీంతో నీటి కొరత ఎదుర్కొంటున్నవారు ప్రైవేట్​ట్యాంకర్లను కొనుగోలు చేస్తుండగా.. ఇదే అదనుగా నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఆర్డర్​చేసిన కొన్ని గంటల్లోనే సప్లై చేస్తుండగా.. ధర మాత్రం అధికంగా ఉంటోంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు చొప్పున తీసుకుంటున్నారు. ముఖ్యంగా కోర్ సిటీతో పాటు ఓఆర్ఆర్​సమీప గ్రామాలు, మున్సిపాలిటీలకు వాటర్​బోర్డు నీటిని అందిస్తోంది. సమ్మర్ నేపథ్యంలో నీటి డిమాండ్​పెరుగుతుంటే.. అందుకు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతుండగా శివారు ప్రాంతాల్లో నీటి కొరత మొదలైంది. ప్రైవేట్​ట్యాంకర్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోగా నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టుగా ధరలు తీసుకుంటున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే  ఏప్రిల్, మే లో మరింతగా కొరత రావొచ్చని, ప్రైవేట్​నీటి సప్లై నిర్వాహకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ప్రైవేట్​ ట్యాంకర్ల దోపిడీ 

కోర్​సిటీలో నీటి సమస్య పెద్దగా లేదు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, హకీంపేట, శామీర్​పేట, బొల్లారం, ఆల్వాల్​, నాగారం, రాంపల్లి, కుషాయిగూడ, పెద్ద​అంబర్​పేట, అబ్దుల్లాపూర్​మెట్​, బాట సింగారం, ప్రతాప సింగారం, నార్సింగి, గండిపేట, శంకర్​పల్లి, శంషాబాద్, మంచిరేవుల, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, చందానగర్, మియాపూర్​తదితర ప్రాంతాల్లో  రోజురోజుకూ నీటి తీవ్రం అవుతోంది. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు ట్యాంకర్లతో నీటిని అమ్ముతుండగా..  ఒక్కో ట్యాంకర్​(5 వేల లీటర్లు)కు రూ. 800 – రూ. 1000 , 10వేల లీటర్ల ట్యాంకర్​కు రూ. 1200 – రూ.1500 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్​ట్యాంకర్ల నిర్వాహకులకు ఫోన్​చేసిన రెండు మూడు గంటల్లోనే నీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే.. చార్జీలు మాత్రం అధికంగా ఉంటున్నట్టు కొనుగోలుదారులు చెబుతున్నారు. సమ్మర్ మూడు నెలలు మాత్రమే జరిగే వ్యాపారమని, ఆ తర్వాత పెద్దగా డిమాండ్​ఉండదని వెంకట్​రెడ్డి అనే వాటర్​సప్లయర్​ తెలిపారు. అందుకే అధిక ధర వసూలు చేస్తున్నామని చెప్పారు.  బోర్​వెల్స్​ ఓనర్లతో అగ్రిమెంట్ చేసుకుని నీటిని తీసుకుంటామని, వారికి చెల్లించే డబ్బులతో పాటు తమకు కూడా మిగలాలి కదా అని.. మరికొందరు ట్యాంకర్ల నిర్వాహకులు పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో 1,800 – 2 వేల మంది వరకూ ప్రైవేట్ వాటర్​సప్లయర్స్​ఉన్నారు. సమ్మర్​లో డిమాండ్​ అధికంగా ఉంటుండగా..  ఒక్కో ట్యాంకర్​రోజుకు 8 నుంచి 12 ట్రిప్పులు కొడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 

Also Read: కాల్వలు సక్కగ లేక చివరికి అందని సాగునీరు

ఆర్డర్లు పెరుగుతుండగా ఫుల్ ​డిమాండ్​

వాటర్​బోర్డు సప్లై చేసే ట్యాంకర్లకు ఫుల్​డిమాండ్​ ఉంటుంది.  రోజుకు 2,000 – 2500 వరకు ఆర్డర్లు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. బోర్డు పరిధిలోని 72  ఫిల్లింగ్​పాయింట్ల నుంచి నీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 500 పైగా ట్యాంకర్లు ఉండగా..  సమ్మర్ లో మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డు సరఫరా చేసే నీటికి రోజు రోజుకూ ఆర్డర్లు పెరుగుతుండగా.. ఒక్కో ట్యాంకర్​(5వేల లీటర్లు) రూ. 500,  రూ. 10వేల లీటర్లకు రూ. 850 వసూలు చేస్తున్నారు. ప్రస్తుత  డిమాండ్​ను బట్టి ఆర్డర్​ ఇచ్చిన 24 గంటలు కానీ, ఒక్కోసారి 48 గంటల్లో పంపిణీ చేస్తున్నారు. ఎండలు ముదిరితే ఆర్డర్లు మరిన్ని పెరుగుతాయి. ఇప్పటికే సమ్మర్​యాక్షన్​ప్లాన్​అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ తో  సమ్మర్​లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అవసరాన్ని బట్టి సరఫరాను కూడా పెంచాలని నిర్ణయించారు. నల్లాల ద్వారా సప్లై చేసే నీటి సమయాలను క్రమబద్ధీకరించడం, అక్రమంగా వాడే వారిపై చర్యలకు కూడా సిద్ధమయ్యారు.