డిసెంబర్ 24 నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు ..106 రోజుల పాటు 52 టీఎంసీలు సరఫరా

డిసెంబర్ 24  నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు ..106 రోజుల పాటు 52 టీఎంసీలు సరఫరా
  • 7.30 లక్షల ఎకరాలకు సాగునీరు
  • ఊపందుకోనున్న వరినాట్లు

నిజామాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. యాసంగి పంటలు కోతకు వచ్చే దాకా ఏప్రిల్​ 8 వరకు వారాబందీ విధానంలో ఏడు తడులు అందించనున్నారు. 106 రోజుల పాటు రిలీజ్​ చేసే తడుల కోసం 57.68 టీఎంసీలు అవసరమని లెక్క తేల్చారు. 

ప్రాజెక్టు 80.501 టీఎంసీలతో పూర్తిగా నిండి ఉన్న నేపథ్యంలో 6.5 లక్షల ఎకరాలకు కావల్సిన నీటి తడులు సమృద్ధిగా ఇచ్చినా ఇంకా 22 టీఎంసీల నీరు బ్యాలెన్స్​ ఉంటుందని, ఆ తరువాత వర్షాలు షురూ అవుతాయని లెక్కలు వేశారు. హైదరాబాద్​లో ఈ నెల 3న ఇరిగేషన్​ మినిస్టర్​  ఉత్తమ్​కుమార్​రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన హై లెవల్  స్కీవమ్​ కమిటీ మీటింగ్​లో ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి తడులు అందించడంపై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

జిల్లాలోని లిఫ్ట్​లు, డ్రింకింగ్​ వాటర్​ స్కీమ్స్​ కూడా ఇందులో చేర్చారు. ప్రాజెక్టు నుంచి 183 కిలోమీటర్ల దూరంలోని ఎల్ఎండీ ఎగువ భాగంలోని డీబీఎం 23 వరకు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. స్టేజ్ 1గా పిలిచే ఈ సాగు విస్తీర్ణం ఉమ్మడి కరీంనగర్, వరంగల్​ జిల్లాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 
విస్తరించి ఉంది.

జోన్ల వారీగా రిలీజ్..​

రిపేర్లు నడుస్తున్న ఎస్పారెస్పీ ఫ్లడ్​ కెనాల్​ను సీజన్​ మొత్తం ఉపయోగించవద్దని నిర్ణయించిన ఇంజినీర్లు ఆయకట్టుకు చెందిన డి/5 నుంచి డి/94 కెనాల్స్​ను రెండు జోన్లుగా డివైడ్​ చేశారు. ఇందులో మొదటి జోన్​ కెనాల్స్​కు 24 నుంచి వారం రోజులు నీటిని రిలీజ్​ చేస్తారు. 

ఫస్ట్​ జోన్​లోని డి/5 కాలువ మెండోరాలో మొదలై మెట్​పల్లిలోని డి/53 వద్ద ముగుస్తుంది. దీనికి 3,500 క్యూసెక్కులు రిలీజ్​ చేయనున్నారు. ఆ తరువాత రెండో జోన్​లోని డి/54 నుంచి డి/94 కెనాల్స్​కు 8 రోజులు నీరు ఇస్తారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో విస్తరించిన జోన్​ కెనాల్స్​ ఆయకట్టు చివరి భాగంలో ఉన్నందున ఆవిరి నష్టాలు జత చేసి రోజుకు 5,500 క్యూసెక్కులు రిలీజ్​ చేయనున్నారు. 

ఇలా వారాబందీ విధానంలో జోన్-1 లోని కెనాల్స్​కు 8 రోజులు, జోన్​- 2లోని కెనాల్స్​కు మరో 8 రోజులు కలిపి సీజన్​ ముగిసేంత వరకు ఏడు తడుల చొప్పున రిలీజ్​ చేయడానికి ప్రిపేరయ్యారు. ఇందుకోసం కాకతీయ కాలువకు 41.43 టీఎంసీలు, సరస్వతీ కెనాల్​కు 3.39 టీఎంసీలు, లక్ష్మీ కాలువకు 3.39 టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు తేల్చారు. అలీసాగర్​ లిఫ్ట్​ స్కీమ్​ ఆయకట్టుకు 2.29 టీఎంసీలు, గుత్పకు 1.41 టీఎంసీలు, ఇతర ఎత్తిపోతలకు 1.32 టీఎంసీలు అలాట్​ చేశారు. తాగు నీటి స్కీమ్​లకు 2.10 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 4.50 టీఎంసీలు కలిపి 57.68 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని తేల్చారు.

ఇక వరి నాట్ల జోరు..

గతేడాది శ్రీరాంసాగర్  ఆయకట్టుకు డిసెంబర్​ 25న మొదటి తడి అందించారు. ఈసారి ఒక రోజు ముందే ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు నిండడంతో పాటు గ్రౌండ్​ వాటర్​ పెరిగి బోర్లు సమృద్ధిగా పోస్తున్నాయి. ఇప్పుడు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలో వరి నాట్ల జోరు పెరగనుంది.