అహ్మదాబాద్/వడోదర: శరీరంలో చెడు కణాలపై నిరంతరం నిఘా పెట్టే యాంటీబాడీల లెక్క దేశ వ్యతిరేక శక్తులపై నిఘా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొంతమంది అండర్గ్రౌండ్లో ఉండి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిని వెతికి పట్టుకునేందుకు రాడికలైజేషన్ సెల్ అవసరం ఉందని ఆయన వెల్లడించారు. యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) గురించి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిస్ చేశామని, ఇటీవల హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కూడా దీని గురించి ప్రస్తావించామని, ఇప్పుడు గుజరాత్లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నామన్నారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ జాతీయ సమస్య అని, దీనికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. యూసీసీని మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గుజరాత్లో బీజేపీ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడంపై అడిగిన ప్రశ్నకు, తమ పార్టీ ‘‘సబ్కా సాత్, సబ్కా వికాస్’’కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బీజేపీ మద్దతుతోనే రాష్ట్రపతి అయ్యారని, ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం గవర్నర్లను కూడా నియమించిందని గుర్తుచేశారు.