హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమిస్తున్నట్టుగా వచ్చిన వార్తలను అంగన్వాడీలు ఖండించారు. తమ సమస్యలను చెప్పేందుకు మంత్రి హరీశ్రావును ఆదివారం ఉదయం కలిశామని, ఆయన సరైన హామీ ఇవ్వనందున సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రకటించారు.
సమ్మె విరమించడానికి అంగన్వాడీలు ఒప్పుకున్నట్టుగా, అంగన్వాడీలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించినట్టుగా మీడియాలో ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రసారం చేయిస్తోందని ఆమె ఆరోపించారు.
ఇలాంటివి నమ్మొద్దని, సమ్మె ఎప్పటిలాగే కొనసాగించాలని అంగన్వాడీలకు ఆమె పిలుపునిచ్చారు. ఇదివరకే నిర్ణయించిన ప్రకారం ఈ నెల 4న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అందరూ తరలిరావాలన్నారు. పీఆర్సీలో చేర్చడం వల్ల లాభం ఏంటో, ఎంత శాతం మేర జీతాలు పెంచుతారో మంత్రి స్పష్టంగా హామీ ఇవ్వలేదన్నారు.