
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్ పనితీరును మూడు నెలల్లో మెరుగుపరుస్తామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హకీంపేటలోని స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ను శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి మంగళవారం (జులై 01) మంత్రి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ను పరిశీలించారు.
హాకీంపేటతో పాటు కరీంనగర్, అదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూల్స్ నిర్వహణలో సమూలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోచ్లు, సిబ్బంది సంఖ్యను పెంచుతామని, వారి పనితీరు మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. అదే సమయంలో ఫలితాలు సాధించే కోచ్లను ప్రోత్సహిస్తూనే సరిగ్గా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇకపై స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీహరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాట్జ్ ఎండీ సోనీ బాలాదేవి, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ టి. మమత పాల్గొన్నారు.