లోక్​సభ ఎన్నికల్లో నేషన్​ మూడ్​ ఎటు?

 లోక్​సభ  ఎన్నికల్లో నేషన్​ మూడ్​ ఎటు?

రాబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌‌ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌‌ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 2014 ఎన్నికల్లో బీజేపీ ‘మోదీ’ అస్త్రాన్ని ప్రయోగించి విజయం సాధించింది. 

2014లో ‘అబ్‌‌ కీ బార్​ మోదీ సర్కార్‌‌’ అంటూ 31 శాతం ఓట్లతో282 స్థానాల్లో గెలిచి పగ్గాలు చేపట్టిన బీజేపీ,  2019లో ‘ఏక్‌‌ బార్‌‌ ఫిర్‌‌ మోదీ సర్కార్‌‌’ అంటూ 37 శాతం ఓట్లతో 303 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంది. 2024 ఎన్నికలను ‘ఫిర్‌‌ ఆయేగా మోదీ’ నినాదంతో 50 శాతం ఓట్లతో 400 స్థానాలను గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చింది. బీజేపీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? లేదా కాంగ్రెస్‌‌ నేతృత్వంలోని ‘ఇండియా’ చేతిలో భంగపడుతుందా? అని విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆర్టికల్‌‌ 370 రద్దు అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్న బీజేపీ త్వరలో సీఏఏ చట్టాన్ని తేనుందని వార్తలొస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని అనుకూలంగా మల్చుకుంటోంది. బీజేపీతోపాటు సంఘ్​పరివార్‌‌ ఈ కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో దాదాపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌‌ వెలువడేవరకు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాయి. ఇందులో భాగంగా జనవరి నెల మొత్తం దేశవ్యాప్తంగా  రాములోరి అక్షింతలు, ఫొటోలను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఏప్రిల్‌‌లో జరిగే ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలు నిస్సందేహంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తాయని గతనుభవాలే తెలియజేస్తున్నాయి. 1984లో కేవలం రెండు లోక్‌‌సభ సీట్లు కలిగున్న బీజేపీ ఇప్పుడు మూడు వందలకుపైగా స్థానాలతో ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా తయారవ్వడానికి ప్రధాన కారణం సున్నితమైన అయోధ్య రామాలయం వంటి అంశాలను ఎంచుకోవడమే. అయోధ్య రామాలయం అంశాన్ని కాంగ్రెస్‌‌ కూడా స్వప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నా ద్వంద్వ వైఖరితో విఫలమైంది. 1986లో అప్పటి కాంగ్రెస్‌‌ ప్రధానమంత్రి రాజీవ్‌‌ గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తీయించినా, ఆ పార్టీ ఊగిసలాట వైఖరితో బీజేపీకే రాజకీయంగా లబ్ధి చేకూరింది.

త్యాగాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​

రాబోయే ఎన్నికల్లో బీజేపీ రామమందిరం వంటి సున్నితమైన అంశాలతోనే విజయం సాధిస్తుందని పూర్తిగా చెప్పలేం. పటిష్టంగా ఉన్న ఆ పార్టీని ప్రతిపక్షాలు దీటుగా ఎదుర్కొనే వైఖరిపై కూడా బీజేపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని 38 పార్టీలతో కూడిన ‘ఎన్‌‌డీఏ’ను కాంగ్రెస్‌‌ నేతృత్వంలో 26 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కొంటే బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్‌‌ కూడా కూటమి ఐక్యత కోసం కొన్ని త్యాగాలకు సిద్ధమవుతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేసి బీజేపీకి మేలు చేసే కంటే విజయావకాశాలున్న 300లోపు స్థానాల్లోనే బరిలో నిలిచి మిగతా సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్‌‌ భావిస్తోంది. 

బీజేపీకి బలమున్న ఉత్తర ప్రదేశ్‌‌, బిహార్‌‌, పశ్చిమ బెంగాల్‌‌,  మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఐక్యత కీలకం కానుంది. బీజేపీ, కాంగ్రెస్‌‌ పార్టీలు మధ్యప్రదేశ్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, రాజస్థాన్‌‌, గుజరాత్‌‌, ఉత్తరాఖండ్‌‌, హిమాచల్‌‌ప్రదేశ్‌‌, గోవా, కర్ణాటక, అస్సాం, హర్యానా రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. మహారాష్ట్రలో  శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోవడంతో ఒక వర్గం ఎన్‌‌డీఏలో మరో వర్గం ‘ఇండియా’తో ఉన్నాయి. మహారాష్ట్రలో శరద్‌‌పవార్‌‌, ఉద్దవ్‌‌ ఠాక్రేలతో, ఢిల్లీలో ఆప్‌‌తో కాంగ్రెస్‌‌ కుదుర్చుకునే సయోధ్యను బట్టి ఫలితాలుంటాయి. ఉత్తరప్రదేశ్‌‌, పశ్చిమ బెంగాల్‌‌, ఒడిస్సా, బిహార్‌‌ రాష్ట్రాల్లో బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్య  ప్రధాన పోటీ ఉంటుంది. ఈ  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌ నుంచి త్యాగాలు అవసరం. ఉత్తరప్రదేశ్‌‌లో సమాజ్​వాదీ పార్టీతో,  బిహార్‌‌లో జేడీ(యూ), ఆర్జేడీలతో, పశ్చిమ బెంగాల్‌‌లో తృణముల్‌‌ కాంగ్రెస్‌‌, వామపక్షాలతో సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే వైఖరితో కాంగ్రెస్‌‌ ఉండాలి. 

కాంగ్రెస్​ పెద్దన్న పాత్ర

దక్షిణాదిన ఉన్న 131 నియోజక వర్గాల్లో బీజేపీ 2019లో 29 గెలిచింది. ఇందులో కర్నాటకలో 25, తెలంగాణలో 4 స్థానాలున్నాయి. ఎనిమిది నెలల క్రితం జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో ఇక్కడ ప్రస్తుతం గతంలో గెలిచిన 25 సీట్లను నిలబెట్టుకోవడం ఆ పార్టీకి సులభం కాదు. ఇక బీజేపీ ఆశలన్నీ 2019లో 62 స్థానాలు సాధించిన ఉత్తరప్రదేశ్‌‌పైనే ఉన్నాయి.  కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ పార్టీకి ఇప్పుడు నాలుగు స్థానాలున్నాయి. కర్నాటక, హిమాచల్​ప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్టంగా సాధించే సీట్లపైనే కాంగ్రెస్​ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. 

2019లో కేరళలో కాంగ్రెస్‌‌ 15 స్థానాలు గెలిచింది. అక్కడ వామపక్షాలతో గట్టి పోటీ ఉండనుంది. తమిళనాడులో 2019లో 39 స్థానాల్లో యూపీఏ 38 స్థానాలు గెలవగా, అందులో కాంగ్రెస్‌‌ వాటా 8 స్థానాలు. ఒక్క సీటు లేని కేరళ, తమిళనాడులో బీజేపీ ఒక్కటి గెలిచినా ఆ పార్టీకి బోనసే. పంజాబ్‌‌లో 2019లో కాంగ్రెస్‌‌ 8 స్థానాలు గెలిచింది. కేరళలో వామపక్షాలు, పంజాబ్‌‌లో ఆప్‌‌ అధిక సీట్లు గెలిచినా అవి ‘ఇండియా’ ఖాతాలో పడడం ఆ కూటమికి ఉపశమనం. కేరళ, పంజాబ్‌‌, తమిళనాడులో కాంగ్రెస్‌‌ ప్రస్తుతమున్న బలాన్ని నిలుపుకుంటూనే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లలో అదనపు స్థానాలు సాధించాలి. కాంగ్రెస్‌‌ పెద్దన్న పాత్ర పోషిస్తూ ‘ఇండియా’ కూటమి రథాన్ని ఐక్యత బాటలో నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది. 

ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్‌‌ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్‌‌ కూటమికి అన్నాడీఎంకే ప్రత్యర్థిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రాంతీయ పార్టీలైన వైఎస్‌‌ఆర్సీపీ, టీడీపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌‌, బీజేపీ నోటాతో పోటీపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌‌, బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ మధ్య త్రిముఖ పోటీ అవకాశాలున్నాయి. పంజాబ్‌‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌‌, ఆప్‌‌ మధ్యే ఉండనుంది. కేరళలో ‘ఇండియా’ కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వామపక్షాలు కాంగ్రెస్‌‌తో ముఖాముఖి తలపడుతున్నాయి. పై రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో బీజేపీ ప్రభావం నామమాత్రమే కావడంతో పోటీ ‘ఇండియా’ కూటమిలోని పార్టీల మధ్యే ఉండడం ఆసక్తికరం. 

ఏపీలో ప్రాంతీయ పార్టీలదే హవా.  ప్రస్తుతం లోక్‌‌సభలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఎన్‌‌డీఏ 332  ‘ఇండియా’ కూటమి 141ఎంపీలను కలిగున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న 400 స్థానాల గెలుపు ఆచరణలో కష్టసాధ్యమే. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో 65 ఎంపీ సీట్లుండగా వాటిలో ఇప్పటికే బీజేపీ ఖాతాల్లో 61 స్థానాలున్నాయి. మహారాష్ట్ర, బీహార్‌‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో గెలిచింది. ఈ రాష్ట్రాల్లో  బీజేపీ పాత మిత్రులు ప్రస్తుతం కాంగ్రెస్‌‌తో దోస్తీ చేయడంతో ఆ స్థానాలు నిలబెట్టుకోవడం సులభం కాదు. 

- ఐ.వి. మురళీ కృష్ణ శర్మ,రీసెర్చర్‌‌,  పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ