మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన ఎంహెచ్ 370 విమానం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. రెండు మూడేళ్లపాటు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో దీని గురించి స్టోరీలు పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. దాని మిస్టరీ తెలుసుకునేందుకు ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నారు. సిబ్బందితో కలిపి 239 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ఏమైందనేది ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. ఫ్యూచర్లో అయినా దొరుకుతుందా? అసలు అది తప్పిపోయిన రోజు ఏం జరిగింది? అందులో ఉన్నవాళ్లు ఇంకా బతికే ఉన్నారా?
అది 2014, మార్చి 8.. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్ 370 ఆకాశంలోకి ఎగిరింది. అందులో 122 మంది చైనావాళ్లు, ఐదుగురు ఇండియన్లు, మిగతావాళ్లు వివిధ దేశాల వాళ్లు ఉన్నారు. అది ఐదున్నర గంటలు ప్రయాణించి బీజింగ్కు చేరుకోవాలి. కానీ.. పైకి ఎగిరిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమానానికి ఏదో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆఫీసర్లు దానికోసం వెతకడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు వెతుకుతూనే ఉన్నారు. అయినా దొరకలేదు. దాదాపు 26 దేశాలు దాని కోసం వెతికాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
కౌలాంపూర్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఆ విమానం నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయినా మిలటరీ రాడార్ ద్వారా దాన్ని ట్రాక్ చేయగలిగారు. అది బీజింగ్ వైపు వెళ్లకుండా మరో వైపుకు తిరిగింది. కాసేపటికీ మళ్లీ లెఫ్ట్ టర్న్ అయింది. అలా చాలాదూరం ప్రయాణించి చివరగా హిందూ మహా సముద్రంలో ఉన్నప్పుడు సిగ్నల్ ఆగిపోయింది. కానీ.. ఎక్కడ కూలిపోయిందో కచ్చితంగా చెప్పలేకపోయారు అధికారులు. దాంతో దాని సిగ్నల్ ఆగిపోయిన చోట వెతకడం మొదలుపెట్టారు. కానీ.. లాభం లేదు. కొన్ని వేల నాటికన్ మైల్స్ వెతికారు. ఒక్క ముక్క కూడా దొరకలేదు. కొన్నాళ్లకు అది కుప్పకూలిన ప్లేస్ నుంచి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో విమానం రెక్క నుంచి విడిపోయిన చిన్న ముక్క దొరికింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం ఐదు ముక్కలు దొరికినప్పటికీ ఒక్క ముక్క మాత్రమే ఎంహెచ్ 370కి చెందినదని మలేషియా గవర్నమెంట్ తేల్చింది. విమానాన్ని వెతకడానికి ఇప్పటివరకు కొన్ని లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. దాదాపు 1,20,000 చదరపు కిలోమీటర్ల మేర గాలించారు. విమానం ఏదైనా ఎత్తైన పర్వతం వెనుక గానీ, సముద్రంలో గానీ పడి ఉండవచ్చని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇదిలా ఉంటే... ఈ విమానం కనిపించకపోవడం వెనుక అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి అవేంటంటే..
సముద్రంలో పడిందా?
విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని చాలామంది సైంటిస్ట్లు చెప్పారు. కానీ.. కొంతమంది మాత్రం.. అది సముద్రంలో పడలేదని వాదించారు. ఎందుకంటే.. అది కూలిపోయే టైంకి ఉన్న స్పీడ్తో సముద్రంలో పడితే ముక్కలుముక్కలు అయ్యేది. అలా జరిగితే.. ఆ ముక్కల్లో కొన్ని నీళ్ల మీద తేలేవి. కానీ.. అలా జరగలేదు. కాబట్టి అది ఎక్కడో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చాలామంది చెప్పారు. కానీ.. దగ్గర్లోని తీరాల్లో ఐదు ముక్కలు దొరకడంతో ఇలాంటి విమర్శలు తగ్గాయి.
హైజాకింగ్
ఇది మాయమైన టైంలో కొన్ని మీడియా సంస్థలు విమానం హైజాక్ అయ్యింటుందని వార్తలు పబ్లిష్ చేశాయి. దాంతో చాలామంది హైజాక్ అయిందనే నమ్మారు. హైజాకర్లు విమానాన్ని ఒక మారుమూల ద్వీపానికి తీసుకెళ్లి ఉంటారని అందరూ అనుకున్నారు. జూలై 2015లో ఎంహెచ్ 370 శిథిలాలు దొరికే వరకు.. అది సేఫ్గా ఉందని నమ్మారు. ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అప్పటికే ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామింగ్ను తొలగించి.. కొత్త ప్రోగ్రాం ఇస్తే అది హ్యాక్ అవుతుంది. అంటే అప్పుడు అది ఎక్కడుందో ఎవరూ గుర్తించలేరు. ఇలా దీన్ని హ్యాక్ చేసి, హైజాక్ చేసి ఉంటారనే సిద్ధాంతం చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. మరికొందరు అందులోని పైలెట్లే హైజాక్ చేసి ఉంటారని చెప్పారు. కానీ.. అందుకు తగిన ఆధారాలు ఏమీ దొరకలేదు. విమానంలో ఇద్దరు ఇరాక్ పౌరులు ఉండడంతో వాళ్లే హైజాక్ చేసి ఉండొచ్చని మరికొందరు నమ్మారు. కానీ.. అది కూడా అవాస్తవమని వాళ్లు ఇరాక్ నుంచి వలస వచ్చిన పౌరులని, బీజింగ్లో ఉండిపోవడానికి విమానం ఎక్కారని అధికారులు తేల్చారు. అందులో ప్రయాణించిన వాళ్ల కుటుంబాలను కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్లెవరికీ క్రిమినల్ హిస్టరీ లేదని తేలింది.
తప్పుడు సమాచారం
టెక్నాలజీ బాగా తెలిసినవాళ్లు విమానాన్ని హైజాక్ చేసి, అందరినీ తప్పుదారి పట్టించేందుకు శాటిలైట్కు తప్పుడు సమాచారం అందేలా చేశారని కూడా కొందరు వాదించారు. అంటే.. అది ఉత్తరం వైపుకు వెళ్లినా.. శాటిలైట్కు దక్షిణం వైపు వెళ్లిందనే సమాచారం అంది ఉండొచ్చని అనుకున్నారు. అది కజకిస్తాన్లోని ఒక సేఫ్ ప్లేస్లో ల్యాండ్ అయ్యుండొచ్చని కొందరు రీసెర్చర్లు చెప్పారు.
మాల్దీవుల్లో కనిపించింది?
మాల్దీవుల్లోని హువధూలో ఉంటున్నవాళ్లు కొందరు ఆకాశంలో 2014 మార్చి 8న సాయంత్రం 06:15 గంటలకు జంబో జెట్ ఎగరడం చూశామని చెప్పారు. దానికి అడ్డంగా ఎర్రటి చారలు ఉన్నాయన్నారు. అయితే.. వాళ్లు చూసింది మలేషియా ఎయిర్లైన్స్ విమానమే అని అందరూ అనుకున్నారు. కానీ.. అది మాల్దీవుల దక్షిణ కొన వైపు వెళ్లింది. కాకపోతే అది ఎంహెచ్ 370 అని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు దొరకలేదు.
ఫోన్ రింగ్...
విమానంలో ఉన్నవాళ్ల ఫోన్లు అది క్రాష్ అయిన తర్వాత కూడా దాదాపు నాలుగు రోజులపాటు రింగ్ అయ్యాయని వాళ్ల బంధువులు కొందరు చెప్పారు. అంటే వాళ్లు నాలుగు రోజుల వరకు బతికే ఉన్నారన్నమాట. మరి బతికుంటే ఎక్కడున్నారు. ఎక్కడ ల్యాండ్ అయ్యారు. వాళ్లు కాల్ ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ దొరకలేదు.
ఆత్మహత్య
ఫ్లైట్ కెప్టెన్ జహారీ అహ్మద్ షాకు తన భార్యతో గొడవలయ్యాయి. చాలా రోజుల నుంచి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందువల్లే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్లైట్ని ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లి సముద్రంలో కూలేలా చేశాడని చాలామంది అనుకున్నారు. కానీ.. ఎంక్వైరీలో అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది.
ఫైర్ యాక్సిడెంట్
కాక్పిట్, కార్గో కంపార్ట్మెంట్, ల్యాండింగ్ గేర్ లేదా ఇంకేదైనా విభాగంలో ఫైర్ పుట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గతంలో ఫ్లైట్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వాదనను చాలామంది నమ్మారు. పైగా ఫ్లైట్లో లిథియం బ్యాటరీలు ఉన్నాయి. వాటివల్లే ఫైర్ పుట్టి ఉంటుందని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ ఫైర్ వల్ల విమానంలో బాగా పొగలు అలుముకుని పైలెట్లతో సహా అందరూ స్పృహ తప్పి ఉంటారు. దాంతో దానంతటదే అలా ఎటుపడితే అటు వెళ్లి చివరగా సముద్రంలో కూలిపోయి ఉండొచ్చు. లేదా ఫైర్ పుట్టగానే వెనక్కి తిరిగి వెళ్లి ఏదో ఒక విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తుండగా అలా హిందూ మహా సముద్రం మీదకి వెళ్లి ఉండొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్.
కూల్చేశారా?
మలేషియా సైనిక దళాలు విమానాన్ని కూల్చేసి ఉండొచ్చనే ఊహలు కూడా పుట్టాయి. శుత్రువుల విమానం అని పొరపాటు పడి ఇలా చేసి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు చెప్పారు. కానీ.. మలేషియా రక్షణ అధికారి అక్బాల్ బిన్ హాజీ అబ్దుల్ సమద్ తమ దేశ వైమానిక దళం విమానాన్ని కూల్చివేయలేదని తేల్చి చెప్పాడు. మిలటరీ రాడార్ ఆ విమానాన్ని గుర్తించిందని, అది వాళ్ల దేశానికి చెందినదే అని కన్ఫర్మ్ చేసుకుని ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన చెప్పాడు. ఇంకొందరేమో ఈ పని అమెరికా వైమానిక దళమే చేసిందని భావించారు.
సముద్రంలోకి దూసుకెళ్లిందా?
టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ గూంగ్ చెన్ విమానం సముద్రంలోకి నిలువుగా దూసుకెళ్లి ఉండవచ్చని అంచనా వేశారు. అలా చాలా లోతులోకి వెళ్లి ఉంటుంది. అందువల్లే దాని జాడ తెలియడం లేదని ఆయన అన్నాడు. కానీ.. అలా జరిగినా అందులోని తేలికైన వస్తువులు పైకి వచ్చి నీళ్లపై తేలేవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఫ్లైట్ 17
ఈ విమానం కూలిపోయిన కొన్ని రోజులకే 17 జూలై 2014న మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 17ని ఉక్రెయిన్లో కూల్చేశారు. అప్పుడు ఉక్రెయిన్లో తిరుగుబాటు జరుగుతోంది. తిరుగుబాటుదారులు ఈ విమానాన్ని చూసి వాళ్లపై దాడి చేసేందుకు వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ అనుకుని కూల్చేశారు. అయితే.. తప్పి పోయిన ఫ్లైట్ 370 లాగానే ఇది కూడా బోయింగ్ 777 మోడల్ కావడం వల్ల ఈ రెండు ఒకటే అని చాలామంది వాదించారు. కానీ.. దీనిపై రీసెర్చ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఈ రెండు విమానాలు వేర్వేరు అని తేల్చారు.
::: కరుణాకర్ మానెగాళ్ల