కరోనాలో కొత్త కొత్త వేరియంట్లతో అల్లాడుతున్న ప్రపంచానికి చైనా సైంటిస్టులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా ఫ్యామిలీలో నియో కొవ్ అనే కొత్త రకం వైరస్ను గుర్తించినట్లు చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ సైంటిస్టులు ప్రకటించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ వైరస్ను దక్షిణాప్రికాలోని గబ్బిలాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జంతువుల్లో మాత్రమే స్ప్రెడ్ అవుతోందని, మనుషుల్లో వ్యాప్తి జరిగే అవకాశాన్ని గుర్తించేందుకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక వేళ ఈ వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తే అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడమే కాదు.. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. చైనా సైంటిస్టుల అధ్యయనంలో తేలిన ఈ విషయాలను bioRxiv సైన్స్ జనరల్లో పబ్లిష్ చేశారు.
ఈ కొత్త వైరస్ గురించి చైనా సైంటిస్టులు చేసిన అధ్యయనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శుక్రవారం స్పందించింది. కొత్త వైరస్ గుర్తించిన సమాచారం తమకు తెలుసని, అయితే నియో కొవ్ వైరస్ భవిష్యత్తులో మనుషుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందా? లేదా? అన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొంది. మనుషుల్లో దాదాపు 75 శాతం అంటు వ్యాధులకు కారణం వన్య ప్రాణులేనని, సార్స్ ఫ్యామిలీకి చెందిన కరోనా వైరస్లు కూడా జంతువుల నుంచి వ్యాప్తి చెందినవేనని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ఈ రకమైన వైరస్లను జూనోటిక్ వైరస్లు అంటారని, వీటిని ఎదుర్కొనేందుకు తాము అనేక పరిశోధనలు చేస్తున్నామని తెలిపింది. అయితే కొత్త వైరస్ గురించి తెలియగానే సైన్స్ జనరల్లో పబ్లిష్ చేయడం ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడించినందుకు చైనా శాస్త్రవేత్తలకు డబ్ల్యూహెచ్వో థ్యాంక్స్ చెప్పింది.