హిందువునని తనపై పాక్ క్రికెట్ టీమ్లో కొందరు తనపై వివక్ష చూపిన విషయం నిజమేనని ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా చెప్పాడు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు తనకు ధైర్యం లేకపోయిందని, కానీ పేసర్ షోయబ్ అక్తర్ నిర్భయంగా బయటపెట్టారని అన్నాడు. నిజాల్ని చెప్పినందుకు అక్తర్కు థ్యాంక్స్ అని చెప్పాడు కనేరియా.
ఓ టీవీ షోలో మాట్లాడుతూ షోయబ్ అక్తర్.. పాక్ టీమ్లో మంచి బౌలర్ అయిన కనేరియాపై హిందువన్న కారణంతో కెప్టెన్ సహా కొందరు ప్లేయర్లు వివక్ష చూపి వేధించేవారని చెప్పాడు. కలిసి భోజనం కూడా చేయనిచ్చేవారుకాదని తెలిపాడు. దీనిపై స్పందించిన కనేరియా తాను ధైర్యంగా ఈ విషయాలను బయటపెట్టలేకపోయానని అన్నాడు. షోయబ్ నిర్భయంగా నిజాలు చెప్పాడని, తన పట్ల వివక్ష చూపిన వారి పేర్లను త్వరలోనే బయటపెడతానని చెప్పాడు. అయితే తన మతంతో సంబంధం లేకుండా కొంత మంది ప్లేయర్స్, బోర్డు అధికారులు అండగా నిలిచారని, వారికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు.
జీవితం దీనంగా తయారైంది.. ఇమ్రాన్జీ పట్టించుకోండి
ప్రస్తుతం తన జీవితం మంచి స్థితిలో లేదని, తనను ఆదుకోవాలని పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ను కోరాడు కనేరియా. తాను ఓ క్రికెటర్గా పాకిస్థాన్కు చేయగలిగిందంతా చేశానని, తాను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలవాలని కోరుతున్నానని అన్నాడు. ఇంగ్లాండ్కు చెందిన ఇంగ్లిష్ క్లబ్ ఎస్సెక్స్కు ఆడుతున్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తనపై జీవిత కాల నిషేధం విధించడంపై స్పందించాలని వేడుకున్నాడు. తాను తప్పు చేయలేదని, ఈ విషయంలో తాను ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు సహా ప్రపంచంలో పలువురు ప్రముఖులు, క్రికెటర్లను కూడా కలిశానని చెప్పాడు కనేరియా. కానీ ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదన్నాడు. ఇటువంటి సమస్యలో ఇరుకున్న పలువురు పాక్ ప్లేయర్లు చాలా ఈజీగా బయటపడ్డారని, కానీ తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నాడు. ప్రస్తుతం తాను దీన స్ఝితిలో ఉన్నానని, ఇప్పటికైనా పట్టించుకోవాలని పాక్ ప్రధాని, ప్లేయర్లు, బోర్డు అధికారులు, ప్రపంచంలోని ఇతర దేశాల క్రికెటర్లను కోరుతున్నానని చెప్పాడు కనేరియా.