- ఎక్కువైన సోషల్ మీడియా ఫ్రాడ్స్
న్యూఢిల్లీ: మీ వాట్సాప్ అకౌంట్ను హ్యాక్ చేసి, మీలా నటించి, మీ కాంటాక్ట్ లిస్టులోని వారందరికీ డబ్బులు పంపాలని సైబర్ మోసగాళ్లు అడగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పరిస్థితులనే కొల్కతాకు చెందిన 45 ఏళ్ల మహిళ తాజాగా ఎదుర్కొన్నారు. సైబర్ మోసగాళ్లు తన వాట్సాప్ నుంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సహా తన కాంటాక్ట్ లిస్టులోని వారికి డబ్బులు పంపమని రిక్వెస్ట్లు పంపారని వాపోయారు. ‘ఇంట్లో వైఫై పనిచేయలేదు. హెల్ప్ కోసం టెలికం సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేశాను. తర్వాత, అంటే జూన్ 5న కస్టమర్ ఎగ్జిక్యూటివ్గా చెప్పుకునే ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
401 కోడ్కు కాల్ చేయమని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పాడు’ అని ఆమె చెప్పారు. కాగా, 401 కోడ్ను 67, ఇతర డిజిట్స్తో ముగిసే నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ల ఫార్వార్డ్కు వాడతారు. ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత గాని ఆమెకు తెలియలేదు తన వాట్సాప్ అకౌంట్ హ్యాక్కు గురయ్యిందని. ఒడిస్సా వెళుతున్నా, అర్జెంట్గా డబ్బులు కావాలంటూ తన అకౌంట్ నుంచి మెసెజ్లు వెళ్లాయని ఆమె పేర్కొన్నారు. ‘ప్రతీ వాట్సాప్ అకౌంట్ ఒక డివైజ్లో ఓ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. హ్యాకర్లు తమ డివైజ్లతో అకౌంట్ను లింక్ చేయాలనుకుంటే వెరిఫికేషన్ కోడ్ ద్వారా చేస్తారు.
ఈ కోడ్ మీరు ఇస్తే మాత్రం మోసగాళ్లు మీ కాంటాక్ట్ డిటెయిల్స్ను ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు’ అని కోల్కతా పోలీస్ ఆఫీసర్ ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి సైబర్ మోసాళ్లపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు కోల్కతా పోలీస్ ఫేస్బుక్లో వార్నింగ్స్ ఇస్తోంది. ‘వాట్సాప్ హ్యాక్ అయ్యింది! ఇలాంటి మెసేజ్లు మీకు వచ్చినట్టయితే, మీ కాంటాక్ట్ లిస్ట్లోని ఎవరైనా ఇలాంటి మెసేజ్లను ఫార్మార్డ్ చేయమంటే చేయొద్దు. మీ వాట్సాప్ అకౌంట్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మోసగాళ్లు ఇలాంటి ట్రిక్స్ వాడుతున్నారు. ఇలాంటి కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి’ అని సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కలిపిస్తున్నారు.