- భర్త ఓ చోట.. భార్య మరోచోట
- స్పౌజ్ బదిలీలకు మోక్షమెప్పుడు
- ఖాళీగా 1,012 టీచర్ పోస్టులు
- వేకెన్సీలు ఉన్నా ట్రాన్స్ఫర్లు చేయని వైనం..
- ఆందోళనలో ఉపాధ్యాయ కుటుంబాలు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పాజ్ బదిలీలు ప్రక్రియ నిలిచిపోవడంతో విద్యాబోధనపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ జీవో ప్రకారం దంపతులైన ఉపాధ్యాయులను వారు కోరుకున్న జిల్లాకు కేటాయించిన అనంతరం మిగిలిన టీచర్లతో జిల్లా కేటాయింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే జనవరిలో ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు కేటాయించే ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మాత్రం స్పౌజ్ బదిలీలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇందులో నిజామాబాద్ జిల్లా కూడా ఉంది. జిల్లాలో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడంతో 146 ఉపాధ్యాయ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరు భర్త ఓ జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 10 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసి డ్యూటీ చేస్తూ వీరు తమ పిల్లలు, తల్లిదండ్రులు సరిగా చూసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని వీడిగా ఉండలేక.. రోజూ దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. దూర ప్రయాణం వల్ల అలసట, మానసిక ఒత్తిళ్లతో నలిగిపోవడంతో బోధనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఆందోళనలో టీచర్స్ ఫ్యామిలీలు..
ఐదు నెలలుగా స్పౌజ్ ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్రమైన మానసిక వేదన నెలకొంది. స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోనైనా తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడ్డారు. కానీ బడులు మొదలైనా స్పౌజ్ బదిలీల సమస్య కొలిక్కి రాకపోవడంతో టీచర్లు నిరాశతోనే డ్యూటీలు చేస్తున్నారు.
ఖాళీలు ఉన్నా..
నిజామాబాద్ జిల్లాలో అన్ని క్యాడర్లలో కలిపి 1,012 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలుగు మీడియంలో 794, ఉర్దూ 159, ఇంగ్లిష్ 9తో పాటు 50 ఇతర భాషా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల కేటాయింపు అనంతరం స్పౌజ్ గ్రౌండ్లో నిజామాబాద్ జిల్లా రావాల్సిన అన్ని కేడర్ల ఉపాధ్యాయులు కేవలం 146 మంది మాత్రమే ఉన్నారు. వీరిని నిజామాబాద్ తీసుకురావడానికి ఖాళీల పరంగా చూస్తే ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.