ఎంసీసీ ఎదుట కార్మికుల దీక్ష..పెండింగ్ జీతాలు, సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్

ఎంసీసీ ఎదుట కార్మికుల దీక్ష..పెండింగ్ జీతాలు, సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్
  • లేదంటే భూముల వేలం అడ్డుకుంటామని హెచ్చరిక

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సిమెంట్ కంపెనీ(ఎంసీసీ) మెయిన్ గేట్ వద్ద తొలగించిన కార్మికులు రిలే దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. మేనేజ్ మెంట్ ఐదేండ్ల కింద కంపెనీని బంద్ చేసినప్పుడు 50 మంది పర్మినెంట్ కార్మికులను తొలగించిందని తెలిపారు.  తమకు రావాల్సిన జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు.

 వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.5లక్షలు మాత్రమే చెల్లిస్తామంటున్నారన్నారు.  రెండు దశాబ్దాలుగా ఎంసీసీనే నమ్ముకుని బతుకుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. ఒక్కో కార్మికుడికి ఎంసీసీ స్థలంలో రెండు గుంట జాగా కేటాయించాలని, రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బ్యాంకును ముందు పెట్టి కంపెనీ భూములు అమ్ముకోవడాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.