
హైదరాబాద్, వెలుగు: సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామంటూ 2021లో తీసుకొచ్చిన స్కీమ్పై ఇప్పటిదాకా సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించలేదని హౌసింగ్ డిపార్ట్మెంట్అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ సాయంపై ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదలు నిరాశ చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా సాయం చేస్తామని, లబ్ధిదారుల లిస్టు ఎమ్మెల్యేలే తయారు చేస్తారని అప్పట్లో సర్కారు ప్రకటించింది. ఇంతకు మించి ఈ స్కీమ్ గురించి ఏ విషయమూ డిసైడ్ కాలేదు. కానీ ప్రతి వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ స్కీమ్ను ప్రస్తావిస్తూ పేదలను ఊరిస్తున్నారు. నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది.
ప్రచారం మాత్రం చేసుకుంటున్నరు
2021లో తొలిసారి ఈ స్కీమ్ను ప్రకటించినప్పుడు ఒక్కో లబ్ధిదారుకు ఐదు లక్షల చొప్పున ఇస్తామని సర్కారు చెప్పింది. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసినా స్కీమ్అమలు కాలేదు. అదే పథకాన్ని 2022–23 బడ్జెట్లో తిరిగి ప్రస్తావించినా అడుగు ముందుకు పడలేదు. పోయిన ఏడాది హుజూరాబాద్ ఎలక్షన్స్లో, ఈ సారి మునుగోడు బై ఎలక్షన్స్లో ఈ స్కీమ్పై అధికార పార్టీ ప్రచారం చేసుకుంది. మంత్రి కేటీఆర్ కూడా డిసెంబర్లోనే ఈ స్కీం మొదలు పెడుతామని ఇటీవల ప్రకటించారు. ఆఫీసర్లు మాత్రం ఈ స్కీమ్ గైడ్లైన్స్ ఫిక్స్ కాలేదని.. చర్చల దశలోనే ఉందని చెప్తున్నారు.
రూ.12 వేల కోట్లు కావాలి
ఈ స్కీమ్ను ఒకేదశలో అమలు చేయాలంటే రూ.12 వేల కోట్లు కావాలి. సర్కారు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఫేజ్ ల వారీగానే అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇది కూడా దళితబంధు స్కీమ్ మాదిరే ఉంటుందని, ఎమ్మెల్యేలు ఎవరి పేరు సూచిస్తే వారికే సాయం అందనుందని అధికారులు చెబుతున్నారు. అయితే అర్హుల గుర్తింపునకు క్రైటిరియా తప్పనిసరని, గైడ్లైన్స్ నిర్ణయిస్తేనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.