ఎంఎంటీఎస్ ఇప్పట్లో​ పట్టాలెక్కేనా?

ఎంఎంటీఎస్ ఇప్పట్లో​ పట్టాలెక్కేనా?

మెట్రోకే స్పందన కరువు

ఈ టైంలో కష్టమంటున్న రైల్వే

పీక్​ హవర్స్​లోనైనా నడపాలంటున్న ప్యాసింజర్స్​

హైదరాబాద్​, వెలుగు అన్​లాక్-​4 తర్వాత నగర వాసులకు మెట్రోరైళ్లు అందుబాటులోకి వచ్చినా సామాన్య ప్రజలకు చౌక ప్రయాణం అందించే మల్టీ మోడల్ ​ట్రాన్స్​పోర్ట్ ​సిస్టమ్​ (ఎంఎంటీఎస్​) రైళ్లు మాత్రం పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడంలేదు. 5 రోజులుగా నగరంలో నడుస్తున్న మెట్రో రైళ్లకే అంతంతగా స్పందన ఉంటోందని, దీనికితోడు రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న టైంలో ఎంఎంటీఎస్​ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం అంత సేఫ్టీ కాదని రైల్వే అధికారులు చెపుతున్నారు. అయితే రైళ్లు నడపకపోవడంతో చిన్నాచితకా పనులు చేసుకుని బతికే చిరుద్యోగులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడి తమ సంపాదనలో సగానికిపైగా చార్జీలకే పెడుతున్నామంటున్నారు.

చార్జీలు తక్కువ

సికింద్రాబాద్–​-లింగంపల్లి, హైదరాబాద్–​-లింగంపల్లి, సికింద్రాబాద్–​-ఫలక్​నుమా మార్గాలలో ఎంఎంటీఎస్​ రైళ్లు నడిచేవి. ప్రతిరోజు 29 స్టేషన్లను కలుపుతూ50 కిలోమీటర్ల పరిధిలో  121 ట్రిప్పులతో సుమారు 1లక్షా 65వేలనుంచి లక్షా 70వేలమందిని వివిధప్రాంతాలకు చేరవేసేవి. దీనికి కారణం ఈ రైళ్లలో  చార్జీలు కనీసం రూ.5 ఉండగా గరిష్టంగా రూ.15 ఉండడమే.

మెట్రోకు స్పందన కరువు

ఈనెల 7 నుంచి మెట్రో రైళ్లు మొదలు కాగా అనుకున్నంతమేరకు స్పందన లభించడం లేదని అధికారులు చెపుతున్నారు. లాక్​డౌన్​కు ముందుకు  4లక్షల 90వేలమంది  ప్రయాణిస్తే  4 రోజులుగా మూడు కారిడార్లలో 31వేలనుంచి 40వేలకు  మించడం లేదు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే  రైళ్లలో కూడా  ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో ఈ మధ్యే  సికింద్రాబాద్​నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రాజధాని సూపర్​ ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​  రైలును తాత్కాలికంగా రద్దుచేశారు. ఇలాంటి  తరుణంలో ఎంఎంటీఎస్​ రైళ్లు నడపలేమంటున్నారు.

మార్నింగ్​,ఈవినింగ్​ నడపాలి

మెట్రోరైళ్లలాగే ఎంఎంటీఎస్​ రైళ్లను కూడా పీక్​ హవర్స్​లో నడిపిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ఉదయం మూడు రైళ్లు, సాయంత్రం రెండు రైళ్లను మేడ్చల్​–-బొల్లారం,- మల్కాజిగిరి, సికింద్రాబాద్,​-లింగంపల్లి వంటి ముఖ్యమైన రూట్లలో నడపాలని కోరుతున్నారు.