
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్తో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు పరస్పరం డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకోవడంతో యుద్ధాలు మేఘాలు అలుముకున్నాయి. అయితే.. పాకిస్తానే తన వక్రబుద్ధిను మరోసారి ప్రదర్శిస్తూ మొదట కవ్వింపు చర్యలకు దిగింది. బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి విక్షచణరహితంగా కాల్పులు జరపడంతో పాటు, డ్రోన్లు, మిస్సైళ్లు, ఫైటర్ జైట్లతో భారత్పై దాడులకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ పాక్ దాడులను భారత్ ఎక్కడికక్కడే సమర్ధవంతంగా ఎదుర్కొంది.
పాక్ నుంచి వందల సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ 400 తిప్పికొట్టింది. పాక్ దాడులను విజయవంతగా నిలువరించడంలో ఎస్ 400 కీలక పాత్ర పోషించడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ శత్రుదుర్భేద్యమైన క్షిపణి వ్యవస్థ పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్న భారత్.. మరికొన్ని ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ యూనిట్ల కోసం రష్యాను సంప్రదించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాక్తో యుద్ధం వాతావరణం నెలకొనడంతో వైమానిక రక్షణ సామర్థ్యాలను పటిష్టం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలన్న భారత అభ్యర్థనను రష్యా ఆమోదించే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
రష్యా తయారుచేసిన ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థను -భారత్లో 'సుదర్శన్ చక్ర' అని పిలుస్తారు. -పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి 2018లో రష్యాతో భారత్ డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఐదు S-400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం 5.43 బిలియన్ల ఒప్పందం జరిగింది. 2021లో పంజాబ్లో మొదటగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. తాజాగా పాక్ తో జరిగిన ఘర్షణల్లో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీ రోల్ ప్లే చేసింది. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను అత్యంత కచ్చితత్వంతో అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్ల కొనుగోలు కోసం రష్యాను భారత్ సంప్రదించినట్లు తెలిసింది.
ఎస్400 డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే..
- ఎస్–400 అనేది అత్యంత అధునాతనమైన లాంగ్- రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎస్ఏఎం) డిఫెన్స్ సిస్టమ్. గరిష్టంగా 400 కి.మీ పరిధి వరకు ఇవి పని చేస్తాయి. 30 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం ఎస్–400 సొంతం.
- బాలిస్టిక్ మిసైళ్లను 60 కిలో మీటర్ల రేంజ్లోనే నిరోధించగలదు. 250 కిలో మీటర్ల గగనతల లక్ష్యాలను ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయగలదు. 400 కిలో మీటర్ల రేంజ్, యాక్టివ్ రాడార్ హోమింగ్తో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం.
- 40 నుంచి 120 కిలో మీటర్ల రేంజ్, ఫైటర్ జెట్ల వంటి కదిలే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేయగలదు. అదేవిధంగా, 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న 300 టార్గెట్లను ట్రాక్ చేయగల థ్రీ-డైమెన్షనల్ ఫేజ్డ్-అరే రాడార్ ఎస్–400లో ఉంటుంది. స్టెల్త్ విమానాలు, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తిస్తుంది.
- ఒకేసారి 36 లక్ష్యాలను ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేస్తుంది. 80 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. 9 నుంచి 10 సెకన్లలోనే పని ముగించేస్తుంది.
- ట్రక్లపైనే ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ సెట్ చేసి ఉంటుంది. 5 నిమిషాల్లో సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుంది. రోడ్డుపై గంటకు 60 కిలో మీటర్లు, ఆఫ్ రోడ్డుపై గంటకు 25 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
- ఎంతటి మోడ్రన్ జెట్లు అయినా దీని రాడార్లో కనిపిస్తుంటాయి. చైనా, పాకిస్తాన్ బార్డర్వెంట నార్త్, ఈస్ట్ సెక్టార్లలో ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్స్ను మోహరించారు. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఎంతో అత్యాధునికమైనవి.