మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు రోడ్డెక్కారు. పెండింగ్డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో హాజీపూర్లో రాస్తారోకో చేశారు. బీజేపీ లీడర్లు, ముంపు బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై గంటన్నరకు పైగా బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు బుజ్జగించినా బాధితులు కదలకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ వచ్చి తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదిలేదని పట్టుబట్టారు. చివరికి తహసీల్దార్ వచ్చి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు బాధితులకు చెల్లిస్తామన్న పైసలు ఇప్పటివరకూ ఇవ్వలేదని, ఇది సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మిస్తే తమ పంటలకు నీళ్లు వస్తాయన్న ఆశతో వేలాది మంది రైతులు భూములను ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పైసలను ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు.
వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, రజినీష్ జైన్, మోటపలుకుల తిరుపతి, మడిపెల్లి సత్యం, బొడ్డు తిరుపతి, మారు వెంకటరెడ్డి, హనుమాండ్ల శ్రీనివాస్, ఉట్నూరి రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.