హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్ ఇంకెన్నడు ?

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  మీటింగ్ ఇంకెన్నడు ?
  • రెండున్నర ఏండ్ల నుంచి సమావేశం ఊసే లేదు 

హైదరాబాద్ : మూడు నెలలకోసారి జరగాల్సిన  హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్  రెండున్నర ఏండ్లయినా జరగడం లేదు. ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి హయ్యర్​ ఎడ్యుకేషన్​ లోని మార్పులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన సర్కారు..  మీటింగ్  పెట్టాలనే విషయాన్నే మరిచిపోయినట్టుంది. దీంతో అనేక అంశాలు రాటిఫై కాక పెండింగ్ పడ్డాయి. నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకోసారి కౌన్సిల్ మీటింగ్ జరగాలి. ఆ కాలంలో జరిగిన పనితో పాటు రాబోయే రోజుల్లో చేసే పనులనూ సమావేశంలో చర్చించాలి. కానీ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్ చివరిసారిగా 2019  ఏడాది చివర్లో జరిగింది. ఆ తర్వాత మీటింగ్ పెట్టాలని నిర్ణయించినా వివిధ కారణాలతో వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా ఎంట్రీతో మీటింగ్​ల ఊసే మరిచిపోయారు.



కొత్త కౌన్సిల్ లేదు.. మీటింగ్ లేదు..
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి 2014 ఆగస్టులో కొత్తగా కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని సర్కారు ప్రకటించింది. మూడేండ్ల కాలపరిమితి ముగియడంతో 2017 ఆగస్టులో రెండోసారి కొత్త కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీలో కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఫైనాన్స్.. లేబర్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ, పలు యూనివర్సిటీల వీసీలుంటారు. వీరితో పాటు సర్కారు నామినేట్ చేసే ఎడ్యుకేషనిస్టులు, ఇండస్ట్రియలిస్ట్ ఇతర సభ్యులుంటారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, కౌన్సిల్ సెక్రటరీ ఇన్వైటీగా ఉంటారు. అయితే సర్కారు నియమించిన కమిటీ సభ్యుల కాలపరిమితి 2020తోనే ముగిసినా.. అప్పటి చైర్మన్​ను కొనసాగిస్తూ కమిటీని సర్కారు పొడిగించింది. పోయినేడు ఆగస్టులో పాత చైర్మన్ పాపిరెడ్డిను తప్పించి, కౌన్సిల్ వైస్ చైర్మన్​గా ఉన్న ప్రొఫెసర్ లింబాద్రికి పూర్తిస్థాయి ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ కౌన్సిల్ కమిటీ ఉన్నట్టా లేనట్టా అనేదానిపై స్పష్టత లేదు.

 

రాటిఫై లేక ఎక్కడి ఫైళ్లు అక్కడే..
కౌన్సిల్ ద్వారా జరిగిన పలు పనులకు కౌన్సిల్ ఈసీ అప్రూవ్ చేయాల్సి ఉంది. నిరుడు కౌన్సిల్​లో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇవ్వగా, వాటికి కౌన్సిల్ ఆమోదం తెలుపుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోస్టులు లేకున్నా అప్పటి కౌన్సిల్ చైర్మన్ కొందరికి ప్రమోషన్లు ఇచ్చారన్న విమర్శలున్నాయి. పలు సంస్థలకు ఇచ్చిన కౌన్సిల్ నిధులపై ఆడిట్ రిపోర్టులు కౌన్సిల్ ముందు పెట్టాల్సి ఉంది. ఈసీ ఆమోదం పొందిన తర్వాత సర్కారుకు ఈ ఫైల్స్ అన్నీ పంపాల్సి ఉంటుంది. కౌన్సిల్ జరిగితే విభజన సమస్యలపై సమగ్రంగా చర్చించే అవకాశముంది. కానీ కౌన్సిల్ మీటింగ్ జరగకపోవడంతో నిర్ణయాలు సక్రమంగా జరగడం లేదనే విమర్శలున్నాయి.

మరిన్ని వార్తల కోసం : -

కాంగ్రెస్ బలపడకపోతే సమాజానికే తీవ్ర నష్టం


ప్రజలు తలుచుకుంటేనే రాజ్యాంగ పదవులొస్తాయి