చిరుతెక్కడ? 50 రోజులైనా జాడ లేదు

చిరుతెక్కడ? 50 రోజులైనా జాడ లేదు

మైలార్‌‌‌‌దేవ్ పల్లిలో కనిపించి మాయం
వేట కొనసాగిస్తున్న ఫారెస్ట్‌‌‌‌ అధికారులు
రాజేంద్రనగర్లో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్డుపై హల్‌‌‌‌చల్‌‌‌‌ చేసి మాయమైన చిరుత జాడ లేకుండా పోయింది. 50 రోజులు దాటినా ఫారెస్ట్ అధికారుల వేట కొనసాగుతూనే ఉంది. చిలుకూరులో కనిపించిందని, హిమాయత్ సాగర్ లో నీళ్లు తాగిందని, రాజేంద్రనగర్ లో ఆనవాళ్లు దొరికాయని చెప్తున్నా… పట్టుకుంది లేదు. దాంతో రాజేందర్ నగర్ ఏరియా ప్రజలు టెన్షన్ పడుతున్నారు.

అలా కనిపించి..
మే14 ఉదయం.. మైలార్ దేవర్ పల్లి రోడ్డుపై డివైడర్ కు ఆనుకుని చిరుత కనిపించింది. లారీ డ్రైవర్ పై దాడి చేసి దగ్గర్లోని ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లోకి వెళ్లింది. దానికి ఆనుకునే అటవీ ప్రాంతం ఉండగా, పట్టుకునేందుకు ఫారెస్ట్‌‌‌‌ అధికారులువేట మొదలు పెట్టారు. అదే నెల 28న రాత్రి గగన్‌‌‌‌పహాడ్‌‌‌‌ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. గ్రేహౌండ్స్‌‌‌‌ పోలీస్ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ పక్కనే ఉండడంతో వాటి సీసీ కెమెరాల ఫుటేజీలో చిరుత కనిపించింది. అదేరోజు హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌లో నీళ్లు తాగుతుంటే చూసినట్లు స్థానికుడొకరు తెలపడంతో అక్కడా గాలించారు. మరోసారి గత నెల 9న గ్రేహౌండ్స్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నీటి కట్ట వద్దకు వచ్చిన ఆనవాళ్లను ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు. 2 బోన్లు, 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అయినా ఫలితం లేదు. చిరుతను పట్టుకునేందుకు ఇంత ఆలస్యమా, జనావాసాల్లోకి రాకపోవడం వల్లే పట్టుకోవడం లేదా? అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

అగ్రి వర్సిటీ అటవీ ప్రాంతంలో..
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, గ్రేహౌండ్స్ అటవీ ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఆ ఏరియాలకు ఆనుకొని ఉన్న కట్ట ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతోందని తెలిపారు. సీసీ టీవీ పుటేజీ, చిరుత అడుగుల ఆధారంగా సురక్షితంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. 900 ఎకరాల అటవీ ప్రాంతంలో ఉన్నందున ప్రస్తుతం జనవాసాల్లోకి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. బయటకు వస్తే పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామన్నారు. లాక్ డౌన్ లో రోడ్లపై రద్దీ లేకపోవడం వల్ల చిరుత జనవాసంలోకి వచ్చి ఉండొచ్చని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్‌‌‌‌ సొసైటీ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్, నార్సింగి, చిలుకూరు ఏరియాల్లో ఎన్నో ఏళ్లుగా చిరుత పులులు ఉన్నాయని, ప్రాణహాని చేయనప్పుడు పట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అగ్రి వర్సిటీ ఫారెస్ట్ ఏరియాలో అడవి పందులు ఎక్కువగా ఉండడంతో దానికి ఆహారం లభిస్తుందని తెలిపాడు.

తొందరగ పట్టుకోవాలె
చిరుత కనిపించినప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో అన్నట్లే ఉంది. అధికారులు తొందరగ చిరుతను పట్టుకోవాలె.
– అనిల్, కాటేదాన్

రోడ్డుమీదికి పోతలేం
చీకటి పడితే రోడ్డుమీది పోవాలంటే భయంగా ఉంది. చిరుతను పట్టుకోడా నికి ఇన్ని రోజులు పడుతుందా? అది మాయమైన కాన్నుంచి భయంగా ఉంది.
– స్వర్ణిల్, శివరాంపల్లి

For More News..

ఆర్టీసీలో వద్దన్నరు..  సింగరేణిలో సై అన్నరు

గేట్లెత్తితే పోయేదానికి ఎత్తిపోస్తున్నరు

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’